ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ టీంలో పెద్ద గొడవ జరుగుతోంది. ఆసియా కప్ నుంచి అర్ధంతరంగా ఈ టీం తప్పుకోవడంతో టీంమేట్స్ మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడట. అందరూ సూపర్ స్టార్లు అవ్వడానికి ప్రయత్నాలు చేయొద్దని, ఇలా మళ్లీ వరల్డ్ కప్లో జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడట.
ఈ మాటలు నచ్చని స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ.. బాగా ఆడిన వాళ్లను ముందు మెచ్చుకోవాలని చురకలేశాడు. దీంతో బాబర్ మరింత సీరియస్ అయిపోయాడు. వీళ్ల గొడవను ఆపడానికి మధ్యలో రిజ్వాన్ కలగజేసుకొన్నట్లు సమాచారం. ఆ తర్వాత టీంలో ఎవరికీ చెప్పకుండానే బాబర్ స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యాడట. ఈ వివాదం నేపథ్యంలో పాక్ మాజీ వికెట్ కీపర్ మొయీన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

షహీన్ అఫ్రిదీ, బాబర్ ఆజమ్ వంటి వాళ్ల మధ్య ఇలా గొడవలు జరగడం పాక్ క్రికెట్కు ఏమాత్రం మంచిది కాదని మొయీన్ ఖాన్ అన్నాడు. వీళ్లిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం జట్టు సభ్యుల మధ్య ఐకమత్యం లేకపోవడాన్ని ఎత్తి చూపుతోందన్నాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్ సమయంలో తను గమనించిన విషయాలను కూడా ఖాన్ వెల్లడించాడు.
'ఈ టోర్నమెంట్ మొత్తంలో చూశాం. నేను దీని గురించి ఇంతకుముందు కూడా చెప్పా. ఒక్క ప్లేయర్ కూడా బాబర్ వైపు రాలేదు. రిజ్వాన్ కానీ, కనీసం వైస్ కెప్టెన్ కూడా అతని వైపు వెళ్లలేదు. అందరూ కూడా ఎవరికి వాళ్లే దూరంగా ఉండిపోయినట్లు అనిపించింది. ఈ టీంలో ఐకమత్యం కనిపించలేదు' అని ఖాన్ అభిప్రాయపడ్డాడు.
వరల్డ్ కప్ వంటి బడా టోర్నమెంట్ ముందే ఈ గొడవ బయటకు రావడం మంచిదైందని ఖాన్ చెప్పాడు. 'పెద్ద టోర్నమెంట్ ముందే ఇలాంటి విషయాలు బయటపడటం మంచిదైంది. దీని వల్ల ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించి, దాన్ని సరిచేసుకోవచ్చు. అలా చేస్తే జట్టులో ఐకమత్యం కూడా పెరుగుతుంది' అని వివరించాడు.
'మ్యాచ్ జరిగే సమయంలో ఇలాంటి సమస్యలు తలెత్తకూడదు. అదే సమయంలో ఇలాంటి వార్తలు బయటకు రావడం, టీంమేట్స్ మధ్య గొడవ అంటూ వస్తున్న వార్తలు అంత మంచి వైబ్ ఇవ్వవు. డ్రెస్సింగ్ రూంలో వాదనలు బయటకు రావడం కూడా కరెక్ట్ కాదు' అని ఖాన్ చెప్పుకొచ్చాడు.