టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్పై మాజీ లెజెండ్ సౌరవ్ గంగూలీ పరోక్ష విమర్శలు చేశాడు. ఇటీవలి కాలంలో టీమిండియాలో ద్రావిడ్ రకరకాల మార్పులు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇలా నిరంతరం జట్టులో మార్పులు చేయడం కరెక్ట్ కాదని గంగూలీ అన్నాడు. ఇలా మరీ ఎక్కువ ప్రయోగాలు చేయడం వల్ల జట్టుకు ఎలాంటి ఉపయోగం ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చాడు.
భారత్, పాకిస్తాన్ మధ్య ఎన్నో మర్చిపోలేని మ్యాచులు జరిగాయి. 2003 వరల్డ్ కప్లో కూడా ఇలాంటి మ్యాచ్ జరిగింది. దీనిలో గంగూలీ సారధ్యంలోని టీమిండియా.. పాక్ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయం గురించి తాజాగా మాట్లాడిన గంగూలీ.. అది ఏడాది పాటు మంచి వెల్ సెటిల్డ్ జట్టును తీర్చిదిద్దిన శ్రమ ఫలితం అని చెప్పాడు. అంతేకానీ, మాటిమాటికీ జట్టులో మార్పులు చేస్తూ ఉంటే అలాంటి ఫలితాలు రావని హెచ్చరించాడు.

'మేం ఆ టైంకి మంచి టీం. గెలవడం కూడా మొదలు పెట్టాం. మా టీంలో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. అందుకే ఏదైనా మెగా టోర్నీ ఉంటే, దానికి ముందు టీంలో ఎక్కువ మార్పులు చేర్పులు చేయొద్దని చెప్తుంటా. ఒక సెట్ ప్లేయర్లను తీసుకొని ఏడాదిపాటి కంటిన్యూ చేయాలి. గెలిచినా ఓడినా వాళ్లు ఒక టీంగా సిద్ధం అవుతారు. ఆసీస్ కూడా 1999 నుంచి 2003 వరకు టీంలో మార్పులు చేయలేదు. అందుకే వాళ్లు అంత బలంగా ఉండేవాళ్లు' అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
అయితే కొన్నిరోజుల క్రితం ప్రెస్ మీట్లో ఇదే విషయంపై ద్రావిడ్ క్లారిటీ ఇచ్చాడు. జట్టులో తాము కావాలని మార్పులు, చేర్పులు చేయడం లేదని ద్రావిడ్ అన్నాడు. పరిస్థితుల వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. 'ప్రస్తుతం టీమిండియాలో నాలుగు, ఐదు స్థానాల గురించి చర్చ జరుగుతోంది. ఏడాది క్రితం అయితే ఈ స్థానాల కోసం పంత్, రాహుల్, అయ్యర్ మధ్య పోటీ ఉందని చెప్పేవాడిని' అని ద్రావిడ్ అన్నాడు.
'ఆ సమయంలో ఈ స్థానాలపై మాకు ఫుల్ క్లారిటీ ఉంది. కానీ ఒకేసారి ముగ్గురూ గాయాలపాలయ్యారు. ఇది ఎవరైనా ఊహిస్తారా? ఈ ఎక్స్పెరిమెంట్ అనే పదం బాగా వాడేస్తున్నారు. ఇదేం మేం ఊరికినే చేస్తోంది కాదు. ఇలా చేయడానికి మా దగ్గర చాలా కారణాలు ఉన్నాయి' అని ద్రావిడ్ వివరించాడు. అయినా సరే ఇప్పుడు గంగూలీ ఇలా కామెంట్ చేయడంపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.