పాకిస్తాన్తో తలపడేందుకు భారత జట్టు రెడీ అవుతోంది. ఈ క్రమంలో అందరూ కూడా పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ గురించి మాట్లాడుతున్నారు. కొత్త బంతితో చెలరేగే అఫ్రిదీని భారత ఓపెనర్లు ఎలా ఎదుర్కొంటారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా లెజెండరీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. షహీన్ గురించి పెద్దగా భయపడాల్సిన అవరసం లేదని తేల్చేశాడు.
షహీన్ చాలా మంచి బౌలరే కానీ, అతన్ని ఆడటం అసాధ్యం కాదని గంగూలీ చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడే ప్రతి బ్యాటర్ ఇలాంటి క్వాలిటీ బౌలర్లను ఎదుర్కోక తప్పదని, దానికోసమే బ్యాటర్లు ప్రిపేర్ అవుతారని వివరించాడు. దుబాయ్లో జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్ను కొత్త బంతితో షహీన్ తెగ ఇబ్బంది పెట్టాడు. కోహ్లీ మినహా మిగతా వాళ్లు అతన్ని ఎదుర్కోవడంలో బాగా తడబడ్డారు.

ఈ క్రమంలో ప్రస్తుతం షహీన్ మంచి ఫామ్లో ఉన్నాడని, అతన్ని ఎదుర్కోవడం భారత ఓపెనర్లకు తలకు మించిన భారమేనని పలువురు నిపుణులు చెప్పారు. ముఖ్యంగా పాక్ మాజీ దిగ్గజాలు మాట్లాడుతూ రోహిత్ శర్మను షహీన్ చాలా ఇబ్బంది పెడతాడంటూ జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ ఈ విషయంపై స్పందించాడు. భారత్ ఈ విషయంలో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నాడు.
'షహీన్ మంచి బౌలరే కానీ అతన్ని ఆడటం అసాధ్యం ఏమీ కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఆడేటప్పుడు ప్రతి టీంలో ఇలాంటి బౌలర్లు ఉంటారు. పాక్లో అఫ్రిదీ, నసీం షా ఉన్నారు. ఆస్ట్రేలియాలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ ఉన్నారు. న్యూజిల్యాండ్లో కూడా ఇలాంటి టాప్ క్వాలిటీ బౌలర్లు ఉన్నారు. అయితే భారత్ వద్ద వాళ్లను ఎదుర్కొనే బ్యాటింగ్ బలం ఉంది' అని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.