ఆసియా కప్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వర్షార్పణం అయింది. వరుణుడి కారణంగా ఈ మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది. రెండో ఇన్నింగ్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలో సూపర్-4 దశ మ్యాచులను శ్రీలంక రాజధాని కొలంబో నుంచి మార్చాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి కొందరు సలహాలు ఇచ్చారు. కానీ దీనిపై ఏసీసీ నిర్ణయం తీసుకోలేదు.
ఈలోపే సూపర్-4 దశ మ్యాచులు కూడా మొదలైపోయాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ నజాం సేథీ మండిపడ్డాడు. బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ ప్రెసిడెంట్ జై షాను టార్గెట్ చేస్తూ చురకలేశాడు. కొలంబోలో రానున్న కొన్ని రోజులపాటు భారీ వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉంది. అయినా సరే ఆసియా కప్ మ్యాచులను వేరే చోటకు మార్చకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని సేథీ అన్నాడు.

ఈ మ్యాచులను హంబంతోటకు మార్చాలని అనుకున్నారు. కానీ ఈ చర్చలు మరింత ఆలస్యం అయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సేథీ చురకలేశాడు. ఇలా వేదిక మారుస్తున్న విషయాన్ని పీసీబీకీ ఏసీసీ తెలియజేసిందని, కానీ చివరి నిమిషంలో వేదిక మార్చకూడదని నిర్ణయం తీసుకున్నారని సేథీ తెలిపాడు. ఈ సందర్భంగా బీసీసీఐను టార్గెట్ చేసిన సేథీ.. పాక్ చేతిలో ఓడిపోతామని భయంతో ఈ మ్యాచ్ కూడా వర్షార్పణం చేయాలని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించాడు.
'మళ్లీ జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వేదికను కొలంబో నుంచి హంబంతోటకు మార్చినట్లు బీసీసీఐ/ఏసీసీ నుంచి పీసీబీకీ సమాచారం అందింది. వర్షం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇది జరిగిన గంటలోనే ఈ నిర్ణయం వెనక్కు తీసుకొని కొలంబోను వేదికగా ప్రకటించారు. అసలేం జరుగుతోంది? పాక్ చేతిలో ఇండియా ఓడిపోతానని భయపడుతోందా?' అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టాడీ మాజీ పీసీబీ చైర్మన్.