పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చాలు విరాట్ కోహ్లీ చెలరేగుతాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్లో పాక్పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ను ఎవరూ మర్చిపోలేరు. ఆ మ్యాచ్లో పాక్ స్టార్ పేసర్ హారిస్ రవూఫ్ బౌలింగ్లో కోహ్లీ బాదిన భారీ సిక్సర్ ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతోంది. ఆ తర్వాత మళ్లీ ఈ రెండు టీమ్స్ తలపడుతోంది ఆసియా కప్ 2023లోనే. పల్లెకెలె వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ క్రమంలో స్టేడియంలో ప్రాక్టీస్ చేయడానికి రెండు జట్లు వచ్చాయి. ఈ సందర్భంగా తన బౌలింగ్ను చిత్తు చేసిన విరాట్ కోహ్లీని హారిస్ రవూఫ్ కలిశాడు. భారత్, పాక్ రెండు జట్లూ పల్లెకెలె స్టేడియంలో శుక్రవారం ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నాయి. ఈ సమయంలోనే కోహ్లీని చూసిన రవూఫ్.. తన దగ్గరకు వచ్చి విరాట్ను కౌగిలించుకున్నాడు. కోహ్లీ కూడా అతన్ని నవ్వుతూ పలకరించాడు.

గతేడాది టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ఓటమి అంచున ఉండగా కోహ్లీ చెలరేగాడు. హారిస్ రవూఫ్ వేసిన 19వ ఓవర్ చివరి రెండు బంతులకు రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఆ మ్యాచ్ మలుపు తిరిగింది. ఎనిమిది బంతుల్లో 28 పరుగులు కావలసిన సమయంలో కోహ్లీ బాదిన రెండు సిక్సర్లతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ శనివారం జరిగే మ్యాచ్లోనే ఒకరినొకరు ఎదుర్కొంటారు.
ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ కూడా గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడే బంతులకు అవుట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అలాగే స్పిన్ను ఎదుర్కోవడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. ఇలా పేస్, స్పిన్ను ఎదుర్కొంటూ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోహ్లీ తన పీక్ ఫామ్ కనబరుస్తాడని, పాక్కు చుక్కలు చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.