భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత హైఓల్టేజ్లో జరుగుతుందో వేరే చెప్పక్కర్లేదు. ఈ రెండు టీమ్స్ ప్లేయ్లు మ్యాచ్కు ముందు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కూడా.. మ్యాచ్లో వాళ్ల స్వభావం మారిపోతుంటుంది. ఆసియా కప్లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. ఈ మ్యాచ్కు ముందు పాక్ పేసర్ హారిస్ రవూఫ్.. టీమిండియాతో నవ్వుతూ మాట్లాడాడు.
గతేడాది టీ20 వరల్డ్ కప్లో తన బౌలింగ్లో చెలరేగిన కోహ్లీని నవ్వుతూ పలకరించాడు. ఇద్దరూ కౌగిలించుకున్నారు కూడా. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. కానీ మ్యాచ్లో రవూఫ్ స్వభావం పూర్తిగా మారిపోయింది. వికెట్లు తీసినప్పుడు అతను ఎంత ఓవరాక్షన్ చేశాడంటే.. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. మ్యాచ్కు ముందు వీడియోలో ఉన్నది ఇతనేనా? అనుకున్నారు.

ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ విఫలమైన సంగతి తెలిసిందే. షహీన్ అఫ్రిదీ బౌలింగ్లో వీళ్లిద్దరూ తడబడి వికెట్లు పారేసుకున్నారు. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ కూడా పెద్దగా రాణించలేదు. దీంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను కుర్ర వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకున్నారు. వీళ్లిద్దరే జట్టుకు మంచి స్కోరు అందించారు.
ముఖ్యంగా ఇషాన్ కిషన్ చక్కని టైమింగ్తో ఆడాడు. అయితే తొడ కండరాలు పట్టేయడంతో సెంచరీకి చేరువైన సమయంలో రన్స్ సరిగా తీయలేకపోయాడు. దీంతో భారీ షాట్లపై ఫోకస్ పెట్టాడు. అప్పుడే హారిస్ రవూఫ్ వేసిన షార్ట్ బాల్ను బలంగా పుల్ చేయబోయాడు. ఈ క్రమంలో బ్యాటు సరిగా కనెక్ట్ అవలేదు. దీంతో బాగా గాల్లోకి లేచిన బంతిని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పట్టేశాడు.
ఇలా కిషన్ అవుటవడంతో రవూఫ్ ఓవరాక్షన్ చేశాడు. పెద్దగా అరుస్తూ కిషన్ వైపు వేళ్లు చూపించాడు. 'ఇక పో' అంటూ సైగలు చేశాడు. అతని ఓవరాక్షన్ చూసిన టీమిండియా ఫ్యాన్స్కు కోపం వచ్చింది. అయితే ఆ తర్వాత మళ్లీ రవూఫ్ వేసిన ఓవర్లో హార్దిక్ పాండ్యా మూడు బౌండరీలు బాది అతనికి బుద్ధి చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ కూడా సంతోషించారు.