క్రికెట్లో అత్యంత పవర్ఫుల్ వైరం ఏదైనా ఉందంటే.. అది భారత్, పాకిస్తాన్ మధ్య వైరమే. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే మ్యాచులకు వచ్చే వ్యూయర్షిప్, ప్రేక్షకుల సంఖ్య చూస్తేనే ఈ విషయం స్పష్టం అవుతుంది. ఈ మ్యాచులకు వ్యూయర్షిప్ రికార్డులన్నీ బద్దలైపోతూ ఉంటాయి. అయితే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఈ రెండు టీమ్స్ తలపడటం చాలా అరుదుగానే జరుగుతోంది.
ఇది కచ్చితంగా ఫ్యాన్స్కు కొంత బాధాకరమైన విషయమే. అయితే ఇలా రేర్గా ఈ మ్యాచులు జరగడం వల్ల వీటిపై హైప్ కూడా అదే రేంజ్లో పెరుగుతోంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే జరిగే ఈ మ్యాచులను మిస్ అవడానికి ఫ్యాన్స్ ఏమాత్రం ఇష్టపడటం లేదు. అలాంటి ఫ్యాన్స్ అందరికీ ఈ ఏడాది మంచి బంపరాఫర్ తగిలినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది.

ఈ మ్యాచులు కూడా వరల్డ్ కప్కు ముందే జరగడం గమనార్హం. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ రెండు టీమ్స్ కూడా ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ మైదానంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగుతుంది. ఇక ఈ గ్రూప్లో ఉన్న మరో టీం నేపాల్. కాబట్టి భారత్, పాకిస్తాన్ టాప్-2 టీమ్స్గా నిలవడం ఖాయం.
అందువల్ల ఈ రెండు టీమ్స్ మరోసారి సూపర్-4 దశలో ఢీకొట్టడం కూడా గ్యారంటీనే. అంతేకాదు, ప్రస్తుతం అన్ని టీమ్స్ ఫామ్ చూసుకుంటే సూపర్-4 దశలో కూడా భారత్, పాకిస్తాన్ టాప్లో నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్, శ్రీలంక ప్రస్తుతం అంత గొప్ప ఫామ్లో లేవు. ఆఫ్ఘనిస్తాన్ మంచి ఫామ్లో ఉన్నా కూడా భారత్, పాకిస్తాన్ ఈ టోర్నీలో ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నాయని మర్చిపోకూడదు.
అంటే సూపర్-4లో కూడా భారత్, పాకిస్తాన్ టాప్ టీమ్స్గా నిలవొచ్చు. అప్పుడు ఈ రెండు టీమ్స్ ఫైనల్లో ట్రోఫీ కోసం మరోసారి తలపడతాయి. ఇదే జరిగితే కేవలం 15 రోజుల వ్యవధిలోనే మూడుసార్లు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచులు చూసే అవకాశం దక్కుతుంది ఫ్యాన్స్కు. గతేడాది కూడా ఇదే ఛాన్స్ దక్కినా.. భారత జట్టు ఫైనల్ చేరకపోవడంతో వాళ్లు నిరాశ చెందారు. ఈసారి అలా జరగకూడదని అనుకుంటున్నారు.