భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అర్ధంతరంగా ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ దెబ్బకు టీమిండియా టాపార్డర్ కుదేలైంది. రోహిత్, కోహ్లీ ఇద్దర్నీ షహీన్ అవుట్ చేశాడు. శ్రేయాస్, గిల్ కూడా ఫెయిలయ్యారు. దీంతో భారత జట్టు స్వల్ప స్కోరు మాత్రమే చేసేలా కనిపించింది.
అయితే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఈ టీంను ఆదుకున్నారు. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీళ్లిద్దరూ ముందుకు నడిపించారు. కిషన్ 82 పరుగుల వద్ద వేగంగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపు అలరించిన పాండ్యా కూడా చివరకు అఫ్రిదీ బౌలింగ్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా, శార్దూల్ ఠాకూర్ కూడా విఫలం అయ్యారు.

దీంతో భారత జట్టు 266 పరుగులకు ఆలౌట్ అయింది. పల్లెకెలె పిచ్పై ఇది మంచి టార్గెట్ అనే చెప్పాలి. ఈ లక్ష్యాన్ని పాక్ ఛేదిస్తుందా? లేదంటే భారత్ పైచేయి సాధిస్తుందా? అని అంతా ఆలోచనలో పడ్డారు. అయితే భారత్ ఈ టార్గెట్ను ఈజీగా కాపాడుకుంటుందని టీమిండియా ఫ్యాన్స్ అనుకున్నారు. బాబర్ ఆజమ్ సహా పాక్ బ్యాటర్లు ఫామ్లో ఉండటంతో పాక్ గెలుస్తుందని ఆ టీం ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు.
కానీ ఈ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. భారత బ్యాటింగ్ తర్వాత భారీగా వర్షం పడింది. దీంతో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. అది మళ్లీ మ్యాచ్కు రెడీ అయ్యే సమయానికి మరోసారి వరుణుడు ప్రతాపం చూపాడు. ఇక మ్యాచ్ జరగడం అసాధ్యం అని ఫీలయిన అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై టీమిండియా మాజీ లెజెండ్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
'ఈ రోజు పాకిస్తాన్లో చాలామంది ఇళ్లలో టీవీలు బతికిపోయాయి' అని పఠాన్ ట్వీట్ చేశాడు. గతంలో భారత్ చేతిలో పాక్ ఓడినప్పుడు చాలా మంది పాకిస్తానీలు కోపంతో తమ ఇళ్లలో టీవీలు బద్దలు కొట్టిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదే విషయాన్ని గుర్తు చేసిన పఠాన్.. ఈ మ్యాచ్లో కచ్చితంగా భారత్ గెలిచి ఉండేదనే ధైర్యం కూడా కనబరిచాడు. పఠాన్ ట్వీట్పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.