వరల్డ్ కప్కు ముందు మరోసారి టీమిండియా నెంబర్ ఫోర్పై పెద్ద చర్చ జరుగుతోంది. గాయం నుంచి ఇటీవలే కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ ఎలా రాణిస్తాడో తెలియదు. సూర్యకుమార్ యాదవ్కు ఈ ఫార్మాట్ కలిసి రాలేదు. సంజూనే సెలెక్టర్లు ఆడనివ్వడం లేదు. దీంతో నాలుగో నెంబర్లో ఎవరు ఆడాలని అందరూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.
దీనిపై పలువురు మాజీలు మాట్లాడుతూ విరాట్ కోహ్లీ పేరును సజెస్ట్ చేశారు. ఇంతకాలం కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఈ స్థానంలో అద్భుతంగా రాణించాడు. అయితే నాలుగో నెంబర్లో సమస్య ఉన్నప్పుడు కోహ్లీని ఆ స్థానంలో పంపాలని, ఈ స్థానంలో కూడా విరాట్ రికార్డు బాగానే ఉందని రవిశాస్త్రి సహా పలువురు చెప్పారు. దీనిపై మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.

కోహ్లీ ఎప్పట్లాగే మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని సన్నీ గట్టిగా చెప్పాడు. కెరీర్ ఆరంభంలో కొంత కాలం మాత్రమే కోహ్లీ నాలుగో నెంబర్లో ఆడాడు. ఈ స్థానంలో 39 ఇన్నింగ్సులు ఆడిన అతను 55.33 సగటు, 90.66 స్ట్రైక్ రేటుతో 1767 పరుగులు చేశాడు. ఇదే విషయం చెప్పిన పలువురు మాజీలు.. కోహ్లీ రికార్డు బాగానే ఉంది కాబట్టి, అతన్నే నాలుగో స్థానంలో పంపాలని సూచించారు.
ఈ సలహాలు బాగానే ఉన్నాయని కొన్ని రోజుల క్రితం గవాస్కర్ కూడా అన్నాడు. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. కోహ్లీ ఏ స్థానంలో సక్సెస్ అయ్యాడో అక్కడే కొనసాగాలని సూచించాడు. 'టీంలో ఉన్న బెస్ట్ ప్లేయర్ ఎక్కువ ఓవర్లు ఆడాలి. మూడో స్థానంలో దిగితే అతనికి ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం దక్కుతుంది. కోహ్లీ బాగా సక్సెస్ అయింది కూడా ఈ పొజిషన్లోనే' అని సన్నీ చెప్పాడు.
'ఈ స్థానంలో కోహ్లీ 43-44 సెంచరీలు చేశాడు. నాలుగో స్థానంలో ఒకటి చేసినట్లున్నాడు. ఇప్పుడు జట్టు కోసం మూడో స్థానంలో ఇంత చేసిన అతన్ని సడెన్గా నాలుగో నెంబర్లో ఎందుకు పంపుతారు? అసలు మార్చాల్సిన అవసరం ఏంటి?' అని నిలదీశాడు. ఫ్యాన్స్ కూడా ఇవన్నీ పిచ్చి ఆలోచనలని, కోహ్లీకి అచ్చొచ్చిన మూడో స్థానంలోనే అతన్ని ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు.
దానికితోడు నాలుగో స్థానంలో కోహ్లీ చివరగా 2020లో ఆస్ట్రేలియాపై ఆడాడు. ఈ స్థానంలో కోహ్లీ ఆడిన చివరి ఏడు ఇన్నింగ్సుల్లో కలిపి కేవలం 62 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంటే ఈ స్థానంలో కోహ్లీ టచ్ పోయినట్లే కదా. ఇదే విషయాన్ని ఫ్యాన్స్ ఎత్తి చూపుతున్నారు. ఫామ్లో ఉన్న కోహ్లీని మూడో స్థానంలోనే కంటిన్యూ చేయాలని చెప్తున్నారు.