దాదాపు ఏడాది తర్వాత భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మ్యాచ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రెండు జట్లూ బలంగానే కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారని తెగ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ లెజెండరీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో కనుక పాకిస్తాన్ టాస్ గెలిస్తే భారత్కు తిప్పలు తప్పవని అక్తర్ జోస్యం చెప్పాడు. అదే సమయంలో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తే వాళ్లు పైచేయి సాధించే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డాడు. మొత్తానికి ఈ మ్యాచ్లో టాస్ కీలకం అని తెలిపాడు.

కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కూడా ఇదే స్టేడియంలో తలపడ్డాయి. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా ఆశించిన స్కోరు చేయలేకపోయింది. అయితే రెండో ఇన్నింగ్స్లో బౌలర్లు అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తుందని, ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తుందని అక్తర్ అన్నాడు.
'ఒకవేళ పాకిస్తాన్ కనుక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే.. వాళ్లు భారత్ను చిత్తు చేస్తారు. అదే సమయంలో భారత్ కనుక టాస్ గెలిస్తే.. పాకిస్తాన్కు ట్రబుల్స్ తప్పవు. ఎందుకంటే ఇక్కడ పిచ్ ఇంకా పూర్తిగా సెటిల్ అయినట్లు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా రెండో ఇన్నింగ్సులో బంతి అంత ఈజీగా బ్యాటుపైకి రావడం లేదు' అని అక్తర్ వివరించాడు.

ఈ మ్యాచ్లో పేసర్లు కీలకం కానున్నారు. ఈ విషయం అంగీకరించిన అక్తర్.. కుల్దీప్ యాదవ్ను మాత్రం టీమిండియా ఆడించాలని సూచించాడు. 'భారత్ ముగ్గురు పేసర్లతో బరిలో దిగాలి. బుమ్రా, షమీ, సిరాజ్ బాగా ఆడుతున్నారు. కుల్దీప్ను పక్కన పెట్టకూడదు. ఇలా అతన్ని పక్కన పెట్టి టీమిండియా చాలా టైం వేస్ట్ చేసింది. కుల్దీప్ చాలా గొప్ప ట్యాలెంట్' అని మెచ్చుకున్నాడు.