పాకిస్తాన్తో కీలకమైన మ్యాచ్ కోసం భారత జట్టు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్లో పాక్ పేసర్లను టీమిండియా ఓపెనర్లు ఎలా ఎదుర్కొంటారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఈ రెండు టీమ్స్ తలపడిన ప్రతిసారీ భారత ఓపెనర్లు తడబడ్డారు. ముఖ్యంగా షహీన్ అఫ్రిదీ బౌలింగ్లో రోహిత్ శర్మ కూడా ఇబ్బంది పడటం కనిపిస్తూనే ఉంది.
ఇలాంటి సమయంలోనే ఆసియా కప్లో ఈ రెండు టీమ్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. దీంతో మరోసారి పాక్ పేసర్లను భారత ఓపెనర్లు ఎలా ఎదుర్కొంటారు? ఎలా ఎదుర్కోవాలి? అని చర్చ జరుగుతోంది. కొత్త బంతితో పాక్ పేసర్లు వేసే స్వింగ్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని వాళ్లను ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ చెప్తారు. అయితే ఇది అసాధ్యం కాదని మాజీ లెజెండ్ గంగూలీ అన్నాడు.

షహీన్ అఫ్రిదీ మంచి బౌలరే కానీ, అతన్ని ఫేస్ చేసే బ్యాటర్లు టీమిండియాలో ఉన్నారని గంగూలీ స్పష్టం చేశాడు. కాబట్టి పాక్ కొత్త బంతి బౌలర్లను చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నాడు. తాజాగా ఇలాంటి అభిప్రాయాన్నే మాజీ దిగ్గజం గౌతం గంభీర్ వెలిబుచ్చాడు. పాక్ పేసర్లను చూసి భారత ఓపెనర్లు భయపడకూడదని, డిఫెన్సివ్గా ఆడితే లాభం కన్నా నష్టమే ఎక్కువని గంభీర్ అన్నాడు.
'పాక్ బౌలర్లపై ఇండియా బ్యాటర్లు ఎదురు దాడి చేయాలి. అంతేకానీ, ఎలాగోలా కొత్త బంతి సమస్య తప్పించుకోవాలని చూడకూడదు. షహీన్ అఫ్రిదీ, నసీమ్ షా విషయంలో రోహిత్, గిల్ అప్రోచ్ చాలా క్లియర్గా ఉండాలి. వాళ్లపై ఎదురు దాడి చేసి పరుగులు చేయడానికి ట్రై చేయాలి. అంతేకానీ సర్వైవ్ అవడానికి కాదు. పరుగులు చేసినప్పుడే మనం మంచి రిథమ్లో ఉంటాం. ఫుట్వర్క్ కూడా చక్కగా ఉంటుంది' అని గంభీర్ సూచించాడు.
'నసీం షా, షహీన్ అఫ్రిదీ ఇద్దరూ కూడా పొట్టి ఫార్మాట్లో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారని అంటున్నారు. కానీ అదంతా గతం. ఇప్పుడు ఆడుతున్నది టీ20లు కాదు. దాంతో పోలిస్తే వన్డేలు చాలా డిఫరెంట్ ఫార్మాట్. వన్డేల్లో బ్యాటర్లకు కుదురుకునే వీలుంటుంది. రెండు, మూడు ఓవర్లపాటు జాగ్రత్తగా ఆడొచ్చు. దీంతో కేవలం సర్వైవ్ అవడానికి చూడకుండా లూస్ డెలివరీలను బాదే పొజిషన్కు చేరుకుంటాం' అని గంభీర్ వివరించాడు.