నేపాల్తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. పల్లెకెలెలో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడిన పిచ్పైనే ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ పిచ్లో కొంత బౌన్స్ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
గత మ్యాచ్లో బ్యాటింగ్ చేశామని, తమ బౌలర్లకు కూడా ఆడే అవకాశం దక్కాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. దానికితోడు వర్షం కూడా పడే అవకాశం ఉండటంతో బౌలింగ్ చేయడమే మంచిదని అనుకున్నట్లు తెలియజేశాడు. గత మ్యాచ్లో బ్యాటింగ్ మాత్రమే చేసినా కూడా చాలా పాజిటివ్స్ చూశామని అన్నాడు.

జట్టు కష్టాల్లో ఉండగా ఇషాన్ కిషన్ బాధ్యత తీసుకొని ఆడటం నిజంగా గొప్ప విషయం అన్నాడు. ఈ మ్యాచ్లో తమ బౌలర్లు ఎలా రాణిస్తారు? అనేది పరీక్షించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అలాగే వాళ్లకు కూడా మ్యాచ్ అనుభవం కోసమే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు వివరించాడు.
వర్షం పడే అవకాశం ఉండటంతో పూర్తి మ్యాచ్ జరుగుతుందో లేదో చెప్పలేమని, అందుకే బౌలర్లకు కూడా గేమ్ టైం దొరకాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. జట్టులో ఒకే ఒక మార్పు చేసినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. పర్సనల్ కారణంతో ఇంటికి వెళ్లిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఆడుతున్నట్లు ప్రకటించాడు.
అలాగే భారత్తో ఆడుతున్న ఈ రోజు తమ నేపాల్ క్రికెట్లో చాలా గొప్ప రోజని ఆ టీం కెప్టెన్ రోహిత్ పాడెల్ అన్నాడు. క్రికెట్ ప్రపంచానికి తమ సత్తా చూపించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్నాడు. అలాగే పాకిస్తాన్తో ఆడిన జట్టులో ఒకే ఒక మార్పుతో బరిలో దిగుతున్నట్లు వెల్లడించాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.