భారత్లో క్రికెట్కు ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీని ఫ్యాన్స్ అస్సలు మిస్ అవ్వరు. ఇదే విషయం మరోసారి రుజువైంది. వరల్డ్ కప్లో భారత జట్టు తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న ఆడనున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాను భారత్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ టికెట్లను ఆన్లైన్లో పెట్టిన పది నిమిషాల్లోనూ అన్నీ అమ్ముడుపోయాయి.
వరల్డ్ కప్కు రోజులు దగ్గర పడటంతో టికెట్ల అమ్మకంపై ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. ఇలా టికెట్లు ఆన్లైన్లో రాగానే, అలా కొనేస్తున్నారు. ఈసారి వరల్డ్ కప్ మ్యాచుల టికెట్లను 'బుక్మైషో'లో అందుబాటులో ఉంచుతున్నట్లు బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఇక ఈ యాప్కు ఫ్యాన్స్ హీట్ ఎంతగా సోకిందంటే.. టికెట్ బుకింగ్ సమయంలో యాప్ పలుమార్లు హ్యాంగ్ అయిపోయేంతగా అన్నమాట.

ఇదే సమయంలో ఆన్లైన్లో టికెట్ల అమ్మకం మొదలు పెట్టిన క్షణాల్లోనే ఇలా అమ్ముడుపోవడంపై కొందరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టికెట్ అమ్మకాలను కూడా బీసీసీఐ, బుక్మైషో సరిగా మేనేజ్ చేయడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అన్ని టికెట్లను బుక్మైషోలో ఉంచలేదని మరికొందరు ఆరోపణలు చేశారు.
ఇలా పబ్లిక్కు ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంచామనే విషయంపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆగ్రహం మరో మెట్టు పైకెక్కింది. కావాలని తమ దళారులకు ఈ టికెట్లు కట్టబెట్టారని, వాళ్లు మ్యాచ్ దగ్గర పడిన తర్వాత ఈ టికెట్లను బ్లాక్లో అమ్ముకుంటారని సోషల్ మీడియాలో పలువురు ఆరోపణలు చేశారు. కొందరేమో టికెట్లు ఉన్నట్లు చూపిస్తున్నా బుకింగ్ చేసుకోవడం కుదరడం లేదంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు.
కేవలం ఆస్ట్రేలియా మ్యాచ్ మాత్రమే కాదు.. ఆఫ్ఘనిస్తాన్తో, బంగ్లాదేశ్తో భారత్ ఆడే వరల్డ్ కప్ మ్యాచుల టికెట్లు కూడా ఇలాగే క్షణాల్లో మాయమయ్యాయి. దీంతో ఫ్యాన్స్ ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ నెగ్గని భారత జట్టు.. తొలిసారి పూర్తిగా స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో ఎలా రాణిస్తుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో టికెట్ బుకింగ్లో ఎదురైన సమస్యలు వారికి కోపం తెప్పించడంలో తప్పేం లేదని కొందరి వాదన.