ఆసియా కప్లో అందరూ ఎదురు చూస్తోంది భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసమే. గ్రూప్ దశలో ఈ రెండు టీమ్స్ తలపడినప్పుడు మ్యాచ్ పూర్తిగా జరగలేదు. కానీ పాక్ బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలడం మాత్రం ఫ్యాన్స్కు ఆందోళన కలిగించింది. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఆడకపోతే ఆ మ్యాచ్లో టీమిండియా కచ్చితంగా చేతులెత్తేసేదే.
ఈ నేపథ్యంలో సూపర్-4 మ్యాచ్కు ముందు పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ.. టీమిండియాకు పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. భారత్తో మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసుకున్న అఫ్రిదీ.. తన బెస్ట్ ఇంకా బయటకు రాలేదని అంటున్నాడు. ఈసారి భారత్, పాక్ మ్యాచ్ కనుక మధ్యలో ఆగిపోతే రిజర్వ్ డే రోజున కొనసాగే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఎలాగైనా ఈ మ్యాచ్ను పూర్తిచేయాలని రెండు దేశాల బోర్డులు అనుకుంటున్నాయి.

వచ్చే నెలలోనే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇంకా రాలేదని అఫ్రిదీ అంటున్నాడు. భారత స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీసుకున్నా కూడా.. తన బెస్ట్ కాదంటూ అతను బోల్డ్ కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ ఆసియా కప్లో అఫ్రిదీ ఇప్పటి వరకు ఏడు వికెట్లు తీసుకున్నాడు. భారత్తో జరిగే ప్రతి మ్యాచ్ తమకు చాలా ప్రత్యేకం అని అఫ్రిదీ అన్నాడు. ఈ మ్యాచ్ను చాలా మంది ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తారని తెలియజేశాడు.
'నేను అండర్-16 క్రికెట్ ఆడటానికి ముందు.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం తెగ ఎదురు చూసేవాడిని. అయితే భారత్పై నేను వేసిన స్పెల్ నా బెస్ట్ అని చెప్పలేను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంత కన్నా మెరుగ్గా.. బెస్ట్ బౌలింగ్ త్వరలోనే వేస్తా' అని ధీమా వ్యక్తం చేశాడీ ఎడం చేతి వాటం పేసర్. తనపై ఉండే ఒత్తిడి గురించి కూడా మాట్లాడిన అతను.. చిన్న వయసులోనే మూడు ఫార్మాట్లలో కొత్త బంతిని డీల్ చేస్తుంటే ఒత్తిడి ఇలాగే ఉంటుందని చెప్పాడు.
'పాకిస్తాన్ తరఫున చిన్నవయసులోనే మూడు ఫార్మాట్లలో కొత్త బంతితో ఆడుతున్నా. అలాంటప్పుడు నేను రాణించాలని ప్రేక్షకులు కోరుకుంటారు. మా పేస్ బౌలింగ్ విభాగంలో ఎవరి పాత్రలు వారికి తెలుసు. హారిస్ చాలా వేగంగా బౌలింగ్ చేస్తాడు. తన పేస్తో ఇంపాక్ట్ చూపిస్తాడు. నసీం, నేను ఆరంభంలో వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తాం. మా మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంది. అదే మా సక్సెస్కు కారణం' అని పేర్కొన్నాడు.