ఆసియా కప్ వేదిక విషయంలోనే తెగ ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్కు తమ జట్టును పంపడం కుదరదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో ఐసీసీ మరో షాకింగ్ డెసిషన్ తీసుకుంది.
2025లో పాకిస్తాన్ వేదికగానే ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. దాన్ని కూడా వేరే వేదికకు తరలించాలని ఐసీసీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ టోర్నమెంటును వెస్టిండీస్, అమెరికాలో నిర్వహించాలని ఐసీసీ అనుకుంటోందట. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఇక్కడే జరగాల్సి ఉంది. అయితే అమెరికాలో స్టేడియాలు ఐసీసీ ప్రమాణాలు అందుకోవడం లేదు.

ఈ క్రమంలో ఈ టీ20 వరల్డ్ కప్ను ఇంగ్లండ్, స్కాట్లాండ్కు తరలించాలని ఐసీసీ భావిస్తోంది. యూఎస్, వెస్టిండీస్ నుంచి ఈ టోర్నీని మార్చేసినందుకు ప్రతిఫలంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను ఇవ్వాలని ఐసీసీ అనుకుంటోందట. దీని వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి వచ్చే నష్టాన్ని కూడా భరించేందు ఐసీసీ సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
అదే జరిగితే ఆసియా కప్తో పాటు కీలకమైన ఐసీసీ టోర్నీ కూడా పాక్ చేజారుతుంది. అయితే ఈ టోర్నీని యూఎస్, వెస్టిండీస్కు మార్చడం వల్ల ఐసీసీకి ఆర్థికంగా కూడా పెద్దగా నష్టం ఉండదు. ఇది అంత పెద్ద టోర్నీ కాదు. అదే టీ20 వరల్డ్ కప్ను వెస్టిండీస్, యూఎస్లో నిర్వహిస్తే ఐసీసీకి చాలా నష్టం జరుగుతుంది.
ఎందుకంటే 2007 వన్డే వరల్డ్ కప్ ఇక్కడే జరిగింది. భారత కాలమానానికి, ఇక్కడి కాలమానానికి చాలా తేడా ఉంది. దీని వల్ల ఉపఖండంలో ఆ వరల్డ్ కప్ ఎక్కువ మంది చూడలేదు. ఒకవేళ వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఇక్కడే జరిగినా దాని వల్ల ఆర్థికంగా ఐసీసీ నష్టపోయే ప్రమాదం ఉంది. అదే ఛాంపియన్స్ ట్రోఫీ అయితే నష్టం అంతగా ఉండదని అంతర్జాతీయ క్రికెట్ మండలి భావిస్తోంది. ఏదేమైనా పాకిస్తాన్కు మాత్రం ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి.