ఆసియా కప్ సూపర్-4 దశలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన భారత్కు గుడ్ న్యూస్. పాకిస్తాన్తో గ్రూప్ దశ మ్యాచ్ తర్వాత గాయంతో సూపర్-4 మ్యాచులకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు ఏర్పాటు చేసిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో అయ్యర్ పాల్గొన్నాడు.
శుక్రవారం నాడు భారత జట్టు తమ చివరి సూపర్-4 మ్యాచులో బంగ్లాదేశ్ను ఢీకొంటుందన్న సంగతి తెలిసిందే. సూపర్-4లో పాక్తో మ్యాచ్కు ముందు శ్రేయాస్ వెన్నునొప్పితో బాధపడ్డాడు. దీంతో అతనికి విశ్రాంతినిచ్చిన టీం మేనేజ్మెంట్.. అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్ను ఎంపిక చేసింది. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న రాహుల్.. పాక్పై సెంచరీతో చెలరేగాడు.

ఆ తర్వాత అయ్యర్ కోలుకున్నా కూడా.. ముందు జాగ్రత్త చర్యగా శ్రీలంకతో మ్యాచులో కూడా అతన్ని ఆడించలేదు. ఈ మ్యాచులో కూడా రాహుల్ అటు బ్యాటుతో, ఇటు కీపింగ్లో రాణించాడు. దీంతో అయ్యర్ రీఎంట్రీతో రాహుల్ను పక్కన పెడతారా? లేక ఇషాన్ కిషన్ను పక్కన పెడతారా? అనేది తెలియాల్సి ఉంది. గ్రూప్ దశలో పాక్పై రీఎంట్రీ చేసిన అయ్యర్ ఆ మ్యాచులో కేవలం 14 పరుగులే చేశాడు.
నేపాల్తో మ్యాచులో అతను బ్యాటింగ్ చేసే అవసం రాలేదు. ఆ తర్వాత వెన్నునొప్పితో బాధపడటంతో అతనికి విశ్రాంతి ఇచ్చారు. ఇక బంగ్లాతో మ్యాచ్కు ముందు ఆప్షనల్ ప్రాక్టీస్లో పాల్గొన్న అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో మ్యాచులో అయ్యర్ ఆడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అతని కోసం కిషన్ను పక్కన పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయ్యర్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన రాహుల్.. పాక్పై సెంచరీ చేయడంతోపాటు శ్రీలంకపై కూడా రాణించాడు. లోస్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచులో 39 పరుగులు చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్కు కీలకమైన సలహాలు ఇచ్చి లంక బ్యాటర్లను బుట్టలో వేసుకున్నాడు. ఈ రెండు మ్యాచుల్లో కలిపి రాహుల్ ఏకంగా 150 పరుగులు చేయడం గమనార్హం.