శ్రీలంక చేతిలో ఓడిన పాకిస్తాన్.. ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే ఫైనల్లో భారత్ను పాక్ ఢీకొట్టేది. ఫైనల్లో దాయాదుల పోరు చూడాలని చాలా మంది అభిమానులు కోరుకున్నారు. కానీ ఆ కల మాత్రం నిజం కాలేదు. ఎనిమిదేళ్ల తర్వాత పాక్ను వన్డేలో ఓడించిన శ్రీలంక.. ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో పాక్ ఓటమికి కెప్టెన్ బాబర్ ఆజమ్ చెత్త నిర్ణయాలే కారణమని పలువురు మండిపడుతున్నారు.
వర్షం వల్ల ఈ మ్యాచ్ను 42 ఓవర్లకు కుదించారు. దీనిలో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు 252/7 స్కోరు చేసింది. డీఎల్ఎస్ విధానంలో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో పాక్పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ సందర్భంగా పాక్ సారధి నిర్ణయాలు ఏమాత్రం బాగలేవని టీమిండియా మాజీ లెజెండ్ గౌతం గంభీర్ అన్నాడు. బాబర్ కెప్టెన్సీ చాలా పేలవంగా ఉందని కుండబద్దలు కొట్టాడు.

'బాబర్ కెప్టెన్సీ కూడా పాక్ ఓటమికి కారణమే. జమన్ ఖాన్ వేసిన ఓవర్లో, అలాగే షహీన్ అఫ్రిదీ ఓవర్లో మిడాఫ్ మీదుగా రెండు ఫోర్లు వెళ్లాయి. ఆ రెండు బంతులు కూడా స్లో డెలివరీలే. ఇలా స్లో డెలివరీలు వేసే సమయంలో మిడాఫ్ ఫీల్డర్ను లాంగాఫ్కు పంపుతారు. అలాగే థర్డ్ మ్యాన్ను కూడా వెనక్కు పంపుతారు. ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ. అదే చివరి ఓవర్లో కనీసం 13 రన్స్ చేయాల్సి వస్తే శ్రీలంకకు కష్టమయ్యేది' అని గంభీర్ వివరించాడు.
చివరి ఓవర్లలో వికెట్ల కోసం చూడాల్సిన అవసరం లేదని, ఆ విషయం బాబర్ అర్థం చేసుకోవాలని గంభీర్ సూచించాడు. టీ20 తరహా ఫీల్డ్ సెటప్తో బ్యాటర్లపై ఒత్తిడి పెంచాల్సిందని అభిప్రాయపడ్డాడు. అలా చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని, ఆ రెండు బౌండరీలు వెళ్లేవి కావని చెప్పుకొచ్చాడు. అలాగే కుశాల్ మెండిస్, సదీర్ సమరవిక్రమ మధ్య సెంచరీ భాగస్వామ్యం సమయంలో కూడా బాబర్ కెప్టెన్సీ ఏమాత్రం బాగలేదన్నాడు.

'ఒక స్టేజ్లో మ్యాచ్ చేజారడానికి అవకాశం ఇచ్చేశారు. జట్టులోని ఆరో బౌలర్ కోటాను పూర్తి చేయాలని బాబర్ అనుకున్నాడు. అలా ఎక్కడా జరగదు. కుశాల్, సమరవిక్రమ మధ్య మంచి భాగస్వామ్యం కుదురుకుంటోంది అనుకున్న వెంటనే.. ప్రధాన బౌలర్లను రంగంలోకి దింపి వారిని అవుట్ చేయడానికి ప్రయత్నించాల్సింది. మిడిల్ ఓవర్లలో మరింత ఎటాకింగ్ అప్రోచ్ తీసుకోవాల్సింది' అని గంభీర్ విశ్లేషించాడు.
పాకిస్తాన్ కనుక వికెట్లు తీసుకొని ఉంటే.. ఆ టీం కచ్చితంగా గెలిచి ఉండేదని గంభీర్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో శ్రీలంక బ్యాటర్లు చక్కగా రాణించి ఉంటే.. లంక కూడా చివరి బంతి వరకు పోరాడాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నాడు. కెప్టెన్సీ విషయంలో బాబర్ కొంత మెరుగవ్వాలి. టీ20 క్రికెట్కు వన్డే ఫార్మాట్కు ఉన్న తేడా అర్థం చేసుకోవాలి' అని గంభీర్ పేర్కొన్నాడు.