ఆసియా కప్లో సూపర్-4 దశ మ్యాచులు మొదలైపోయాయి. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తలపడ్డాయి. లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో జరిగిన ఒక విషయం పీసీబీ పరువు తీసేసింది. పాక్ ఛేజింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది. పాక్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో స్టేడియంలో ఒక పక్క ఫ్లడ్లైట్స్ సడెన్గా ఆగిపోయాయి. ఇవి వెంటనే మళ్లీ వెలుగుతాయని అంతా అనుకున్నారు.
కానీ ఈ లైట్లు ఆగిపోవడం వల్ల 20 నిమిషాల పాటు అంపైర్లు మ్యాచ్ ఆపేశారు. ఆ తర్వాతే ఫ్లడ్లైట్లు వెలిగాయి. ఇది చూసిన ఫ్యాన్స్ జోకులు పేలుస్తున్నారు. నాలుగు మ్యాచులే సరిగా నిర్వహించలేకపోతున్న పాక్.. పూర్తి ఆసియా కప్ నిర్వహిస్తానని అనడం పెద్ద జోక్ అని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఆసియా కప్ మొత్తం పాక్లోనే జరగాల్సి ఉండగా.. తమ టీంను పాకిస్తాన్ పంపడానికి బీసీసీఐ ససేమిరా అన్న సంగతి తెలిసిందే.

చివరకు హైబ్రీడ్ మోడల్లో ఈ టోర్నీ నిర్వహించేందుకు ఏసీసీ ఆమోదం తెలిపింది. పాక్తోపాటు శ్రీలంకలో టోర్నీ నిర్వహించాలని సూచించింది. అయితే ఇప్పుడు శ్రీలంకలో వర్షాల వల్ల కొన్ని మ్యాచులు ఫలితం తేలడం కష్టంగా మారింది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వర్షార్పణమైంది. ఆ తర్వాత నేపాల్, భారత్ మ్యాచ్కు ప్రేక్షకులు పెద్దగా రాలేదు.
దీంతో శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహించడం వల్ల తమకు బాగా నష్టం వచ్చిందని, కాబట్టి ఏసీసీ తమకు నష్టపరిహారం చెల్లించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. టోర్నీ మొత్తం పాక్లోనే నిర్వహించి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చేవి కావని కొందరు పాక్ దిగ్గజాలు, పీసీబీ మాజీ చీఫ్ నజాం సేథీ కూడా అన్నారు. ఇలాంటి సమయంలో గడాఫీ స్టేడియంలో ఫ్లడ్లైట్లు ఆగిపోవడంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు.
పాకిస్తాన్ అసలు ఆసియా కప్ నిర్వహించగలదా? అని నిలదీస్తున్నారు. ఇక 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పాక్లోనే జరగాల్సి ఉంది. ఇక ఆ టోర్నీకి కూడా ఇదే గతి పడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క ఫ్లడ్లైట్తో పీసీబీ పెద్దల మొఖంలో వెలుగు మాయమైందని ఫ్యాన్స్ జోకులు వేస్తున్నారు.