ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నీ ప్రారంభించిన శ్రీలంక.. ఈ విజయంతో 11వ సారి ఆసియా కప్ ఫైనల్లో అడుగు పెట్టింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఆరంభం నుంచే తడబడింది.
అయితే చివర్లో మహమ్మద్ రిజ్వాన్ (82 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. అతనికి ఇఫ్తికర్ అహ్మద్ (47) మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వర్షం వల్ల 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచులో రిజ్వాన్, ఇఫ్తికర్ అద్భుతమైన భాగస్వామ్యంలో పాకిస్తాన్ 252/7 పరుగుల స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓపెనర్లు కుశాల్ పెరీరా (17), పాథుమ్ నిస్సంక (29) పెద్దగా రాణించలేదు.

అయితే ఆ తర్వాత వచ్చిన ముగ్గురు బ్యాటర్లూ మంచి పట్టుదల కనబరిచారు. ముఖ్యంగా కుశాల్ మెండిస్ (91) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సదీర్ సమరవిక్రమ (48) కూడా ఆకట్టుకోగా.. చరిత్ ఆశలంక (49 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇలా కీలకమైన మ్యాచులో పాకిస్తాన్ ఓడిపోవడంపై నెట్టింట తెగ జోకులు పేలుతున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్తో ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ తలపడేది.
ఇంతకుముందు భారత్, శ్రీలంక మ్యాచు కూడా థ్రిల్లింగ్గానే సాగింది. ఆ సమయంలో భారత్ కావాలనే లంక రన్ రేట్ తగ్గకుండా ఆడిందని, ఆ మ్యాచ్ ఫిక్స్ అయిందని పాక్ అభిమానులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లంక చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియా వేదికగా పాక్ టీంను తెగ ట్రోల్ చేస్తున్నారు.
'లాహోర్ వెళ్లడానికి టికెట్ డబ్బులున్నాయా?' అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమందేమో పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఎన్ని టీవీలు పగిలిపోయి ఉంటాయి? అని అడుగుతున్నారు. శ్రీలంక బ్యాటర్లు పాక్ను పూడ్చిపెట్టేశారని మరికొందరు జోకులు పేలుస్తున్నారు. అలాగే బాధగా ఉన్న బాబర్ ఫొటోలు షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.