శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేజేతులారా ఓడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక అద్భుతంగా ఆడింది. కుశాల్ మెండిస్ (92) సహా మరికొందరు బ్యాటర్లు కీలక ఇన్నింగ్సులు ఆడారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ టీం 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఛేజింగ్లో ఆఫ్గనిస్తాన్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 27 పరుగులకే ఆఫ్గాన్ ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు.
దీంతో ఆ టీం ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో రహ్మత్ షా (45), కెప్టెన హష్మతుల్లా షాహిదీ (59) అద్భుతంగా ఆడారు. మాజీ కెప్టెన్ మహమ్మద్ నబీ (65) కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆఫ్గాన్ టీం విజయానికి చేరువైంది. అయితే శ్రీలంక బౌలర్లు.. వీలు చిక్కినప్పుడల్లా వికెట్లు తీస్తూ ఆఫ్గాన్ టీంను ఒత్తిడిలోకి నెట్టారు. దానికితోడు ఈ ఛేజ్ను 38 ఓవర్లలో పూర్తి చేస్తే ఆఫ్గాన్ కూడా సూపర్-4 దశకు చేరే ఛాన్స్ ఉంది.

ఇది తెలిసిన ఫ్యాన్స్ అంతా కూడా ఆఫ్గాన్ టీం వేగంగా ఆడి మ్యాచ్ గెలవాలని ప్రార్థనలు చేశారు. చివరకు 38 వ ఓవర్లో నాన్స్ట్రైకర్ ఎండ్లో రషీద్ ఖాన్ ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివరి బ్యాటర్ ఫజల్లాక్ ఫరూఖీ కనుక సింగిల్ తీసి రషీద్కు అవకాశం ఇస్తే.. అతను మ్యాచ్ ముగించడమే కాదు, తమ టీంను సూపర్-4కు కూడా చేరుస్తాడని అంతా నమ్మారు. అలాంటి సమయంలో ఫరూఖీ చేసిన పని అందరికీ షాకిచ్చింది.
ఇలాంటి ఇంపార్టెంట్ టైంలో ఫరూఖీ అనూహ్యంగా డిఫెన్స్ ఆడాడు. భారీ షాట్లు అంటే ఆడలేకపోయాడని అనుకోవచ్చు. కానీ కనీసం సింగిల్ తీసే ప్రయత్నం కూడా ఫరూఖీ చేయలేదు. చివరకు 38వ ఓవర్ నాలుగో బంతికి అతను కూడా అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో ఆఫ్గాన్ కనుక 37.5 ఓవర్లలో 295 పరుగులు చేసి ఉంటే.. సూపర్-4కు చేరుకునేది. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఆ టీంను ట్రోల్ చేస్తున్నారు.
ఆఫ్గాన్ టీం అనలిస్ట్ ఈ విషయాన్ని ఫరూఖీకి చెప్పి ఉండడని, అందుకే అతని అలా ఆడాడని అంతా అనుకుంటున్నారు. ఈ కారణంగా ఆఫ్గాన్ టీం అనలిస్టుపై జోకులు పేలుస్తున్నారు. 'ఒక కాలిక్యులేటర్ కొనుక్కోవచ్చు కదరా అబ్బాయ్' అని కొందరు అంటుంటే.. మ్యాచ్ అయిపోయాక రషీద్ అండ్ గ్యాంగ్ అంతా కలిసి అనలిస్ట్ తాట తీస్తుందని మరికొందరు అంటున్నారు.
ఏదేమైనా అనలిస్టు చేసిన పొరపాటు వల్ల ఆఫ్గాన్ టీంకు బాగా నష్టం జరిగిందనే చెప్పాలి. ఈ మ్యాచ్ గెలవడంతోపాటు సూపర్-4కు వెళ్లే ఛాన్స్ కూడా ఆ టీం మిస్ చేసుకుంది. దీంతో ఆ టీం ఫ్యాన్స్ చాలా బాధ పడుతున్నారు. అదే సమయంలో ఈ విజయంతో శ్రీలంక సూపర్-4కు చేరుకుంది. దీంతో ఇప్పటికే సూపర్-4 చేరిన పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్లతో లంక కూడా కలిసింది.