శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్లో షాకింగ్ ఘటన జరిగింది. అప్పటికే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బంగ్లాకు మరో షాక్ తగిలింది. ముష్ఫికర్ రెహ్మాన్ అవుటైన తర్వాత మెహది హసన్ మిరాజ్ (5) క్రీజులోకి వచ్చాడు. మంచి బ్యాటింగ్ ట్యాలెంట్ ఉన్న అతను అప్పటికే హాఫ్ సెంచరీ చేసి క్రీజులో కుదురుకున్న షాంటోకు జతకలిశాడు.
దీంతో వీళ్లిద్దరూ బంగ్లా ఇన్నింగ్స్ చక్కదిద్దుతారని ఫ్యాన్స్ భావించారు. కానీ అలా జరగలేదు. కేవలం ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెహదీ హసన్ రనౌట్ అయ్యాడు. రజిత వేసిన బంతిని స్క్వేర్ లెగ్ దిశగా పంపిన షాంటో.. సింగిల్ కోసం వెంటనే పరుగు మొదలు పెట్టాడు. అయితే అవతలి ఎండ్లో ఉన్న మెహదీ హసన్ అంత వేగంగా స్పందించలేదు.

ఈ క్మంలో స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న ధనంజయ డిసిల్వ అద్భుతంగా బంతిని అందుకొని బౌలర్ రజిత వైపు విసిరాడు. దాన్ని అందుకున్న రజిత వెంటనే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న బెయిట్స్ కూల్చాడు. ఇది జరిగిన వెంటనే శ్రీలంక ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. అయితే షాంటో, మెహదీ హసన్ ఇద్దరిలో ఎవరు అవుటయ్యారో మాత్రం ఎవరికీ అర్థం కాలేదు.
రిప్లేలు చూడగా.. షాంటో వేగంగా వెళ్లి నాన్ స్ట్రైకర్ ఎండ్లో క్రీజును దాటేసినట్లు కనిపించింది. అయితే మెహదీ హసన్ మాత్రం క్రీజు బయటే ఉన్నాడు. దీంతో అతనే రనౌట్గా వెను తిరగాల్సి వచ్చింది. ఇలా అవుటైనందుకు మెహదీ హసన్ చాలా చికాకుగా కనిపించాడు. నెట్టింట ఫ్యాన్స్ కూడా చాలా ఇరిటేట్ అవుతున్నారు.
బంగ్లా బ్యాటింగ్ విభాగం కుప్పకూలడాన్ని అడ్డుకుంటారని అనుకుంటే.. ఇలా అనవసర పరుగు కోసం ప్రయత్నించి అవుటవడం ఏంటని మండిపడుతున్నారు. అసలే ఇక్కడి పిచ్పై భారీ స్కోరు చేయడం కష్టం. దానికితోడు మ్యాచ్ మధ్యలో చిరుజల్లులు కూడా పడ్డాయి. ఇలాంటి సమయంలో బంగ్లా సరైన స్కోరు చేయకపోతే ఓడిపోతుందని టెన్షన్ పడుతున్నారు.