టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. అంతకుముందు సుమారు మూడేళ్లపాటు పేలవ ఫామ్లో ఉన్న అతను.. ఆ తర్వాత నెలరోజుల విశ్రాంతితో రీఎనర్జైజ్ అయిపోయాడు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఆసియా కప్లో రీఎంట్రీ చేశాడు. ఈ టోర్నీలో బ్యాటుతో చెలరేగాడు. ఆ టోర్నీలో భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఇక అప్పటి నుంచి కోహ్లీ మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోలేదు. గతేడాది టీ20 వరల్డ్ కప్లో కూడా తన టాప్ క్లాస్ చూపించిన అతను.. టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. కోహ్లీ రాణించినా భారత జట్టు ట్రోఫీ నెగ్గకపోవడం అభిమానులను నిరాశ పరిచింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా చెలరేగాడు.

ఈ సిరీసులో కూడా భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసింది కోహ్లీనే కావడం గమనార్హం. ఐపీఎల్లో కూడా రెండు సెంచరీలతో చెలరేగాడు. అంతేకాదు, అంతకుముందు మూడేళ్లపాటు అంతర్జాతీయ సెంచరీ చేయలేపోయిన అతను.. ఈ ఏడాదిలో ఏకంగా ఆరు శతకాలతో అదరగొట్టాడు. అలాగే 15 సార్లు 50పైగా పరుగులతో ఆకట్టుకన్నాడు.
ఈ ఏడాది కాలంలో మొత్తం 42 ఇన్నింగ్సులు ఆడిన కోహ్లీ.. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. అతను ఓవరాల్గా 54.5 సగటుతో 1856 పరుగులు చేశాడు. అంతేకాదు, ఏకంగా ఆరుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ కోహ్లీ 2.0కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నారు.
కోహ్లీ ఒక కింగ్లా రీఎంట్రీ ఇచ్చాడని చాలా మంది ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మాట్తో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లలో రాణిస్తూ అభిమానుల ఎదురు చూపులకు న్యాయం చేశాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ 3.0ను కూడా చూస్తామని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.