ఆసియా కప్లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలేలా ఉంది. ఇంతకాలం వైట్ బాల్ ఫార్మాట్లో రోహిత్ డిప్యూటీగా ఉన్న అతన్ని డిమోట్ చేయాలని సెలెక్టర్లు అనుకుంటున్నారట. తాజా సమాచారం ప్రకారం ఆసియా కప్తోపాటు వరల్డ్ కప్లో కూడా రోహిత్ డిప్యూటీగా జస్ప్రీత్ బుమ్రాను నియమించాలని బీసీసీఐ పెద్దలు డిసైడ్ అయ్యారట.
ఇంతకాలం ఈ రెండు మెగా టోర్నీల్లో కూడా హార్దిక్ పాండ్యానే వైస్ కెప్టెన్గా ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ బీసీసీఐ పెద్దల ఆలోచన వేరే విధంగా ఉందని, ఈ కారణంగానే ఐర్లాండ్తో సిరీసులో బుమ్రాను కెప్టెన్గా నియమించారని తెలుస్తోంది. ఈ వివరాలను బీసీసీఐకి చెందిన ఒక అధికారి వెల్లడించడం గమనార్హం.

'వన్డేల్లో వైస్ కెప్టెన్సీ విషయంలో హార్దిక్కు బుమ్రా గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు. కేవలం లీడర్షిప్ సీనియారిటీ చూసుకున్నా బుమ్రానే ముందు వరుసలో ఉంటాడు. ఎందుకంటే పాండ్యా కన్నా ముందే టీమిండియాకు బుమ్రా నాయకత్వం వహించాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీసులో వైస్ కెప్టెన్గా కూడా బుమ్రానే ఉన్నాడు' అని సదరు బీసీసీఐ అధికారి చెప్పారు.
గతేడాది ఇంగ్లండ్తో ఓవల్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో టీమిండియాకు బుమ్రా నాయకత్వం వహించాడు. రోహిత్కు అనారోగ్యంతో ఈ మ్యాచ్ ఆడలేదు. ఆ తర్వాత వైస్ కెప్టెన్గా కూడా బుమ్రా సేవలందించాడు. అయితే ఆ తర్వాత వెన్నునొప్పి తీవ్రం కావడంతో అతను జట్టుకు దూరమయ్యాడు.
ఇప్పుడు మళ్లీ 11 నెలల తర్వాత క్రికెట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ రెండింట్లో టీమిండియా వైస్ కెప్టెన్ పదవికి బుమ్రా, పాండ్యా మధ్య పోటీ నెలకొంది. సోమవారం నాడు ఆసియా కప్ జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. అప్పటి వరకు వీరిలో ఎవరి వైపు సెలెక్టర్లు మొగ్గు చూపిందీ తెలియదు.
కానీ బుమ్రాకే ఈ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమచారాం. ఈ టోర్నీలో వైస్ కెప్టెన్గా ఉన్న వారికే వరల్డ్ కప్లో కూడా ఈ పదవి దక్కడం గ్యారంటీ అని చెప్పొచ్చు. మరి అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు ఎవరికి ఓటేస్తారో చూడాలి.