బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.. ఇద్దరూ కూడా పాకిస్తాన్ ప్రయాణం అయ్యేందుకు రెడీ అవుతున్నారట. ఆసియా కప్ మొదలైన తర్వాత వీళ్లిద్దరూ పాక్ వెళ్లి వస్తారని సమాచారం. సెప్టెంబర్ 5న శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్కు వీళ్లిద్దరూ హాజరవుతారని తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారుల ఆహ్వానం మేరకే భారత ప్రతినిధులుగా బిన్నీ, శుక్లాను పంపాలని నిర్ణయించారట.
ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఈ రెండు బోర్డుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న తర్వాత.. తమ టీంను పొరుగు దేశానికి పంపేది లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించాడు. దీంతో ఈ రెండు బోర్డుల మధ్య గొడవ మొదలైంది. ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా బీసీసీఐ వైఖరిని తప్పుబట్టారు.

ఒకవేళ భారత్ కనుక ఆసియా కప్ కోసం పాక్ రాకపోతే.. తాము కూడా వరల్డ్ కప్ కోసం భారత్కు రాబోమని పీసీబీ బెదించింది కూడా. చివరకు హైబ్రీడ్ మోడల్లో టోర్నీ నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. అలాగే పాకిస్తాన్ కూడా వరల్డ్ కప్ ఆడతామని తెలిపింది. దీంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఇక ఇప్పుడు బీసీసీఐ అధికారులు కూడా పాక్కు వెళ్లేందుకు అంగీకరించడం విశేషం.
2012 తర్వాత బీసీసీఐ అధికారులు ఇలా పొరుగు దేశం వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బీసీసీఐ వర్గాల సమచారాం ప్రకారం బిన్నీ, శుక్లా ఇద్దరూ ముందుగా శ్రీలం వెళ్తారట. అక్కడ భారత్ ఆడే మ్యాచ్ చూసిన తర్వాత.. సెప్టెంబర్ 3న పాకిస్తాన్ చేరుకుంటారట. 'వాళ్లిద్దరూ శ్రీలంక వెళ్లి భారత్, పాక్ మ్యాచ్ చూస్తారు. ఆ తర్వాత అట్టారీ బోర్డర్ దాటి సెప్టెంబర్ 3న పాక్కు వెళ్తారు' అని సదరు అధికారి తెలిపారు.
'బీసీసీఐని తమ దేశానికి రావాలని పీసీబీ ఆహ్వానించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్లో కీలకమైన భాగస్వామి కావడం వల్లనే బీసీసీఐకి ఈ ఆహ్వానం అందింది. స్టేక్ హోల్డర్లతో చర్చించిన తర్వాత ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ను పాకిస్తాన్కు పంపించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది' అని వివరించారు. భారత్, పాక్ జట్లు ఆసియా కప్లో సెప్టెంబర్ 2న తలపడతాయనే సంగతి తెలిసిందే.