ఆసియా కప్ మళ్లీ పాకిస్తాన్ చేరింది. ఇక్కడి లాహోర్ స్టేడియంలో బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ జట్లు తలపడేందుకు రెడీ అయ్యాయి. తొలి మ్యాచ్లో శ్రీలంక చేతిలో చిత్తయిన బంగ్లాదేశ్కు ఈ మ్యాచ్ చాలా కీలకం. దీనిలో కూడా ఓడితే ఆ జట్టు సూపర్-4 దశకు చేరడం అసాధ్యం. కాబట్టి ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ చాలా ఒత్తిడిలో ఉంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
అంతకుముందు శ్రీలంకపై కూడా బంగ్లా సారధి ఇదే నిర్ణయం తీసుకున్నాడు. కానీ అది బెడిసి కొట్టింది. అయినా సరే ఈ మ్యాచ్లో షకీబల్ హసన్ కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ ఎంచుకోవడం గమనార్హం. అలాగే జట్టులో మూడు కీలక మార్పులు చేసినట్లు అతను వెల్లడించాడు. లాహోర్లో బాగా ఎండగా ఉండటం, అలాగే పిచ్ పరిస్థితులను బట్టి ముందుగా బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయినట్లు చెప్పాడు.

ఈ మ్యాచ్లో తాము టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేసేవాళ్లమని ఆఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అన్నాడు. ఇటీవల పాకిస్తాన్తో ఆడిన వన్డే సిరీస్ అనుభవం తమకు ఆసియా కప్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. లాహోర్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు కొంత సహకారం లభించొచ్చని తెలుస్తోంది.
శ్రీలంకతో బంగ్లాదేశ్ ఆడిన మ్యాచ్లో అరంగేట్రం చేసిన తంజీద్ హసన్ను బంగ్లా జట్టు పక్కన పెట్టేసింది. ఆ మ్యాచ్లో హసన్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓపెనర్గా మెహదీ హసన్ మిరాజ్ను పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతను గతేడాది చివర్లో భారత్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంకపై కూడా అతను రాణిస్తాడని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ మెహదీ హసన్ రనౌట్ అయ్యాడు.
ఈ క్రమంలో మెహదీ హసన్ బ్యాటింగ్ నైపుణ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని షకీబల్ హసన్ అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే అతనికి ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చారని సమాచారం. ఇక ఆఫ్గన్ టీంలో మరోసారి రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ కీలకం కానున్నారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సూపర్-4 వైపు ముందడుగు వేయడం ఖాయం.