
షార్జా: అచ్చొచ్చిన గడ్డపై భారత క్రికెట్ జట్టు చెలరేగుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతున్న ఆసియా కప్ 2022 టోర్నమెంట్పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. గ్రూప్-ఏలో భాగంగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లల్లోనూ విజయఢంకా మోగించింది. ఈ గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచింది. రెండో రౌండ్కు అలవోకగా అర్హత సాధించింది. సూపర్ 4లో క్వాలిఫై అయిన జట్టును ఢీ కొట్టాల్సి ఉంది టీమిండియాకు.
తొలుత పాకిస్తాన్, దాని తరువాత హాంకాంగ్లను ఓడించింది టీమిండియా. నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్-ఏలో ఇవ్వాళ బాబర్ ఆజమ్ నాయకత్వాన్ని వహిస్తోన్న పాకిస్తాన్.. హాంకాంగ్తో తలపడనుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు గెలుపు రుచి చూడని జట్లే ఈ రెండు కూడా. యూఏఈలోని షార్జా స్టేడియంలో మ్యాచ్ షెడ్యూల్ అయింది. భారత కాలమానం ప్రకారం- సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.ఇందులో గెలిచిన జట్టు సూపర్ 4లో భారత్ను ఢీ కొడుతుంది.

సూపర్ 4 రౌండ్ ఆడటానికి ముందు బిగ్ బ్రేక్ తీసుకుంది టీమిండియా. దుబాయ్ బీచ్లో సందడి చేస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యుజ్వేంద్ర చాహల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా.. ఇలాజట్టు మొత్తం దుబాయ్ బీచ్లో ఒకేచోట కనిపించింది. కొందరు ప్లేయర్లు బీచ్ వాలీబాల్ ఆడారు. రోహిత్ శర్మ కయాకింగ్ చేస్తూ కనిపించాడు. విరాట్ కోహ్లీ టాప్లెస్లో మెరిశాడు.

దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ రెజునవేషన్తో టీమిండియా మరింత జోష్తో కనిపించడం ఖాయం. సూపర్ 4 రౌండ్లో తన తదుపరి మ్యాచ్లల్లో ప్రత్యర్థికి చుక్కలు చూపించేలా ఉంది. ఈ నెల 4వ తేదీన పాకిస్తాన్ లేదా హాంకాంగ్, 6న శ్రీలంక, 8వ తేదీన ఆఫ్ఘనిస్తాన్తో ఆడాల్సి ఉంది భారత జట్టుకు. 4వ తేదీన భారత్తో తలపడే జట్టు ఏదనేది ఈ రాత్రికి తేలిపోతుంది. పాకిస్తాన్-హాంకాంగ్తో జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు భారత్తో ఆడుతుంది.