
గాయం వల్ల ఆసియా కప్ 2022కి పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది దూరమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వకార్ యూనిస్ కవ్వించే స్టేట్ మెంట్ ఇచ్చాడు. అతను మిస్సవ్వడంతో భారత టాపార్డర్ బతికిపోయారనేలా ట్వీట్ చేశాడు. మోకాలి స్నాయువు గాయం కారణంగా షాహీన్ ఆసియా కప్కు దూరం కానున్నాడు. 2021 టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో పాక్ 10వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో షాహీన్ షా అఫ్రిది కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఆ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఇక బాబర్ ఆజామ్, రిజ్వాన్ కలిసి రెండో ఇన్నింగ్స్లో విజయలాంఛనాన్ని ముగించింది. ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్తో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇక షాహీన్ గాయాన్ని ప్రస్తావిస్తూ.. ఆసియా కప్ టోర్నీకి ఫాస్ట్ బౌలర్ అయిన షాహీన్ షా అఫ్రిది అందుబాటులో లేకపోవడం 'చాలా బాధగా ఉంది' అని వకార్ ట్వీట్ చేశాడు.
షాహీన్ గాయం వల్ల దూరమవ్వడం భారత టాపార్డర్ బ్యాట్స్మెన్కు పెద్ద ఉపశమనం. అతన్ని #AsiaCup2022లో చూడలేకపోవడం విచారకరం. త్వరలోనే అతను గాయం నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధించాలని కోరుతున్నాను.' అని వకార్ యూనిస్ ట్వీట్ చేశాడు. ఇకపోతే షాహీన్ స్థానంలో పాకిస్థాన్ ఇప్పటివరకు ఏ బౌలర్ పేరు ప్రకటించలేదు. ఇకపోతే పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కూడా షాహీన్ గాయం గురించి మాట్లాడాడు.
అతను అక్టోబర్లో జరిగే టీ20 ప్రపంచకప్కు అందుబాటులోకి వస్తాడని ఆశించాడు. 'షాహీన్ మా అత్యుత్తమ బౌలర్. అతను గాయపడడం.. అలాగే ఆసియా కప్కు అందుబాటులో లేకపోవడం చాలా దురదృష్టకరం. కానీ అతను భవిష్యత్ సిరీస్లకు, అలాగే ప్రపంచకప్కు అందుబాటులో ఉంటాడని మేము ఆశిస్తున్నాం. మేం మున్ముందు మరింత బిజీ క్రికెట్ ఆడవలసి ఉంటుంది. మా టీమ్ కల్చర్ ఏ టీమ్పైనా ఎప్పుడూ రిలాక్స్ అవ్వదు' అని షాదాబ్ పేర్కొన్నాడు.