
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఆసియా కప్ 2022లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గ్రూప్-ఏలో భాగంగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లల్లోనూ విజయఢంకా మోగించింది.. అగ్రస్థానంలో నిలిచింది. రెండో రౌండ్కు అలవోకగా అర్హత సాధించింది. సూపర్ 4లో అడుగు పెట్టింది. ఈ రౌండ్లో భాగంగా తన తదుపరి మ్యాచ్ను ఆదివారం ఆడబోతోంది. టీమిండియా ప్రత్యర్థి ఎవరనేది ఇంకా తేలట్లేదు. ఇక్కడ కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది.
సూపర్ 4లో టీమిండియా తొలి ప్రత్యర్థి ఎవరనేది తేలాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సి ఉంటుంది. పాకిస్తాన్ లేదా హాంకాంగ్.. భారత్తో తలపడొచ్చు. ఇవ్వాళ గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్-హాంకాంగ్ మధ్య జరిగే మ్యాచ్లో గెలిచే జట్టు సూపర్ 4కు చేరుకుంటుంది. తన తొలి మ్యాచ్లో భారత్ను ఎదుర్కొంటుంది. ఓడిన జట్టు ఇంటిదారి పట్టుతుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్, రెండో మ్యాచ్లో లంకేయుల చేతిలో ఓడింది బంగ్లా.
ఈ సాయంత్రం జరిగే మ్యాచ్లో ఓడిన జట్టు టోర్నీ నుంచి బయటికి వెళ్తుంది. మొత్తంగా నాలుగు జట్లు రెండో రౌండ్కు చేరుకోవాల్సి ఉంది. ఇప్పటికే భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 4కు క్వాలిఫై అయ్యాయి. నాలుగో జట్టు ఏదనేది ఈ రాత్రికి స్పష్టమౌతుంది. ఈ రెండు జట్ల బలబలాలను బేరీజు వేసుకుని చూస్తే- మరోసారి భారత్-పాకిస్తాన్ తలపడే అవకాశాలే అధికంగా కనిపిస్తోన్నాయి. అదే జరిగితే- కిందటి ఆదివారం ఏ రకంగా ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ కొనసాగిందో ఈ సండే కూడా బిగ్ డేగా మారొచ్చు.
సూపర్ 4లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ లేదా హాంకాంగ్, 6వ తేదీన శ్రీలంక, 8న ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లను ఆడుతుంది టీమిండియా. అక్కడితే సూపర్ 4 కూడా ముగుస్తుంది. మ్యాచ్కు ఇంకా రెండు రోజుల గడువు ఉన్నందున టీమిండియా ఆటగాళ్లు దుబాయ్ బీచ్లో సందడి చేస్తోన్నారు. బీచ్ వాలీబాల్, కయాకింగ్, సర్ఫింగ్ చేస్తూ ప్లేయర్లు సరదాగా గడిపారు.