
దుబాయ్: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ రోహిత్ శర్మపై విమర్శల దాడికి బ్రేకులు పడట్లేదు. వాటి తీవ్రత కొనసాగుతూనే ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ 2022లో భారత జట్టు సూపర్ 4 దశలోనే వెనక్కి రావడం వల్ల విమర్శలకు కేంద్రబిందువు అయ్యాడు. పాకిస్తాన్, శ్రీలంకల్లో ఓడటం వల్ల ఫైనల్స్కు చేరలేకపోయింది భారత్. దాని ప్రభావం రోహిత్ శర్మపై పడుతోంది. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫీల్డ్లో రోహిత్ శర్మ అన్కంఫర్టబుల్గా ఉంటోన్నాడని పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యానించాడు. గట్టిగా అరుస్తూ కనిపిస్తోన్నాడని, ఇది మంచిది కాదని చెప్పాడు. రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్ క్యాచ్లు డ్రాప్ చేసిన తరువాత రోహిత్ శర్మ ప్రదర్శించిన ఆగ్రహావేశాలు, అగ్రెసివ్నెస్- టీమిండియా క్యాంప్లో అస్థిరతకు దారి తీస్తుందని అంచనా వేశాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్కు ుందు అలాంటి పరిస్థితులు ఏ జట్టుకు కూడా మంచిది కాదని పేర్కొన్నాడు.
పాకిస్తాన్ మాజీ కేప్టెన్ వసీం అక్రమ్ కూడా రోహిత్పై బౌన్సర్లు సంధించాడు. ఈ టోర్నమెంట్ వ్యాఖ్యాతలలో ఒకరైన అక్రమ్- పాకిస్థాన్తో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో స్పోర్ట్స్ యాంకర్ మయంతి లాంగర్తో మాట్లాడుతున్నప్పుడు రోహిత్ శర్మపై సెటైర్లు వేశాడు. భారత్ ఆటతీరు గురించి మయంతి లాంగర్ అడిగిన ప్రశ్న ఆయనను ఇరిటేట్ చేసింది.
తొలుత ఆ ప్రశ్నకు తొలుత సమాధానం ఇవ్వడాన్ని దాటవేశాడు వసీం అక్రమ్. తోటి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సమాధానం ఇస్తాడంటూ బదులిచ్చాడు. మయంతి పట్టుబడటంతో నవ్వుతూ ఆమె ప్రశ్నకు వసీం సమాధానం ఇచ్చాడు. రోహిత్ శర్మ బహుశా టీవీలో తనను తాను చూసుకుంటూ అనారోగ్యంతో ఉండొచ్చేమోనని కామెంట్ చేశాడు. కిందటి రోజంతా ఇండియా గురించి చర్చించాననని, ఇవ్వాళ పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ గురించే మాట్లాడుకుందామని చెప్పుకొచ్చాడు వసీం అక్రమ్.