
టీమిండియాకు షాకింగ్ న్యూస్. భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆసియా కప్ టోర్నీకి దూరమయ్యాడు. అతని స్థానంలో మరో స్పిన్ ఆల్రౌండర్ స్టాండ్ బైగా ఎంపికైన అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. రవీంద్రా జడేజాకు మోకాలి గాయం కారణంగా విశ్రాంతి అవసరమైంది. దీంతో అతన్ని తప్పించక తప్పలేదు. ఇకపోతే జడేజా ఈ ఆసియా కప్ టోర్నీలో మంచి ఫాం కనబర్చుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఇండియాను గట్టెక్కించిన జడేజా.. హాంకాంగ్ మ్యాచ్లో అతను కీలక రనౌట్ చేయడం కూడా మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అయింది. ఈ మ్యాచ్లో ఓ వికెట్ తీసిన రవీంద్ర జడేజా ఆసియా కప్ టోర్నీలో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ను అధిగమించి ఆసియా కప్ టోర్నీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. ఇర్ఫాన్ పఠాన్ 22 వికెట్లు తీయగా.. జడేజా 23వికెట్లు తీసి అతన్ని దాటేశాడు. జడేజా 2010లో తన తొలి ఆసియా కప్ టోర్నీ ఆడాడు. వరుసగా జరిగిన అన్ని ఆసియాకప్ టోర్నీల్లో జడేజా ఆడాడు.
ఇక ఆసియా కప్ 2022లో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ గెలుపొందింది. హాంకాంగ్తో బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో సులువుగా విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా గ్రూప్ ఏ టాపర్గా సూపర్ 4కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ సూర్యకుమార్ (68)దంచుడుకు తోడు కోహ్లీ (59) క్లాస్ ఇన్నింగ్స్ వల్ల నిర్ణీత 20ఓవర్లలో 2 వికెట్లకు 192పరుగులు చేయగా హాంకాంగ్ ఛేదనలో 152పరుగులకే పరిమితమైంది. రవీంద్ర జడేజా హాంకాంగ్ కెప్టెన్ నిజాఖత్ ఖాన్ను అద్భుతంగా రనౌట్ చేసి ఆ జట్టుకు జలక్ ఇవ్వడంతో ఇక ఆ జట్టు తర్వాత కోలుకోలేకపోయింది.
ఆసియా కప్ కోసం భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్
స్టాండ్ బై ప్లేయర్లు : దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్