ముంబై: దేశంలో ప్రాణాంతక వైరస్ మహోత్పాన్ని సృష్టించడం ఆరంభమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్, 14వ ఎడిషన్ అర్ధాంతరంగా వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు ఇది ప్రేక్షకుల ముందుకొస్తుందనేది తెలియట్లేదు. సెప్టెంబర్లో నిర్వహిస్తారంటూ వార్తలొస్తోన్నాయి. అవి వార్తలు మాత్రమే. భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) దీన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ నెల 29వ తేదీన బీసీసీఐ నిర్వహించబోతోన్న కీలక సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అప్పుడే స్పష్టత వస్తుంది.
ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడిన చేదు సందర్భాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటోన్న క్రికెట్ ప్రేమికులకు మరో దుర్వార్త అందింది. ఆసియా కప్ 2021 (Asia Cup 2021) కూడా పోస్ట్ పోన్ అయింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ దీన్ని అధికారికంగా ప్రకటించింది.ఈ టోర్నమెంట్ను 2023కు వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఆసియా కప్ది కూడా వాయిదా పద్ధతే కావడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడే అర్హత గల ఆరు దేశాలు పాల్గొనే మెగా టోర్నమెంట్ ఇది.
భారత్.. దాని చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తలపడే హైఓల్టేజ్ టోర్నీగా క్రికెట్ ప్రేమికులు దీన్ని గుర్తిస్తుంటారు. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెస్ టోర్నీకంటే దీనికి ఉన్న డిమాండ్ ఎక్కువ. నిజానికి- ఈ టోర్నమెంట్ ఈ ఏడాది శ్రీలంకలో నిర్వహించాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధాంతరంగా రద్దయిన ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచ్లను పూర్తి చేయాల్సి ఉండటం, ఈ ఏడాది చివరిలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిర్వహించబోతోండటం, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ దీనికి తోడు కావడం, అదే సమయంలో టీమిండియా ఇంగ్లాండ్లో రెండున్నర నెలల పాటు సుదీర్ఘ పర్యటించాల్సి ఉండటం వంటి టైట్ షెడ్యూల్ వల్ల ఆసియా కప్ 2021ను 2023కు వాయిదా వేసినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది.
2018 తరువాత ఇప్పటిదాకా ఆసియాకప్ టోర్నమెంట్ ఏర్పాటు కాలేదు. ఆ ఏడాదిలో భారత్ ఛాంపియన్గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 222 పరుగులు చేయగా.. మూడు వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది రోహిత్ శర్మ కేప్టెన్సీలోని భారత జట్టు. సెంచరీతో చెలరేగిన బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ను అందుకున్నాడు.