
న్యూ ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ కోహ్లీ లేకుండానే పోరాడిన భారత్.. ఎట్టకేలకు ఆసియా కప్ టోర్నీ గెలుచుకుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఏడోసారి ఆసియాకప్ను ముద్దాడింది భారత్. చివరి బంతి వరకూ హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై టీమిండియా విజయం సాధించింది. దుబాయ్ గడ్డపై టోర్నమెంట్ మొదటి నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది భారత జట్టు.
కానీ, ఫైనల్లో కాస్త తడబడింది. అయినా ఆ ఒత్తిడిని జయించి కప్ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా టీమిండియాను విరాట్ కోహ్లీ అభినందించాడు. అటు ఫైనల్లో టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చిన బంగ్లాదేశ్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు.
'టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతం. నిన్న రాత్రి అత్యంత ఉత్కంఠమైన పోరులో పైచేయి సాధించి కప్ను గెలుచుకున్నారు. మనకోసం ఏడోసారి కప్ను తీసుకువచ్చారు. ఇక బంగ్లాదేశ్ను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. మ్యాచ్ చివరి వరకు మీ పోరాటాన్ని సాగించారు. కంగ్రాట్స్ బంగ్లాదేశ్. మీ పోరాటంతో క్రికెట్ అభిమానుల హృదయాలను గెలిచారు.కప్ మొదటి నుంచి మీరు గట్టి పోటీ ఇచ్చారు.' అంటూ ట్వీట్ చేశాడు.
ఆసియాకప్కు కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి, ముంజేతి నొప్పితో బాధపడుతున్న కోహ్లీకి కాస్త విరామం దొరికింది. దీంతో కెప్టెన్సీ పగ్గాలు ఓపెనర్ రోహిత్ శర్మకు అప్పగించారు. వెస్టిండీస్తో జరగబోయే టెస్టు సిరీస్లో భాగంగా కోహ్లీ ఫిట్నెస్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.
భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, ఉమేశ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్