
హైదరాబాద్: శ్రీలంక పేసర్ లసిత్ మలింగ మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు. సెప్టెంబరు 15 నుంచి యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్లో ఆడే జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. 16 మంది సభ్యుల జట్టులో లసిత్ మలింగకు కూడా లంక సెలక్టర్లు చోటు కల్పించారు.
దాదాపు ఏడాదికాలంగా జట్టుకి దూరంగా ఉన్న మలింగ ఆసియా కప్లో మళ్లీ బంతిని అందుకోనున్నాడు. 2017లో భారత్పై చివరిసారిగా మలింగ తన వన్డే మ్యాచ్ని ఆడాడు. గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శనపై ఆ దేశ క్రీడల మంత్రి పెదవి విరిచారు.
ఆటగాళ్లకి కనీస ఫిట్నెస్ ప్రమాణాలు కూడా లేవని ఆ సమయంలో మంత్రి విమర్శించడంతో లసిత్ మలింగ క్రీడల మంత్రిపై వ్యంగ్యంగా స్పందించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే శ్రీలంక జట్టులో చోటు కోల్పోయాడు. 2018 ఐపీఎల్ సీజన్లో కూడా ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.
దీంతో మలింగ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా అతడిని ఆసియా కప్ కోసం ప్రకటించిన వన్డే జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే, ఆసియా కప్లో శ్రీలంక జట్టుకి ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.