
హైదరాబాద్: ఆసియా కప్ ఆరంభానికి ముందు శ్రీలంక జట్టుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. గాయం కారణంగా ఇప్పటికే ఆ జట్టు టెస్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్ దూరం కాగా, తాజాగా ఓపెనర్ ధనుష్క గుణతిలక మొత్తం ఆసియా కప్ టోర్నీకే దూరమయ్యాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది.
గత కొన్ని రోజులుగా ధనుష్క గుణతిలక నడుం నొప్పితో బాధపడుతున్నాడు. ఆసియా కప్ టోర్నీ ప్రారంభానికి కోలుకుంటాడని భావించిన ఆ దేశ సెలక్టర్లు ధనుష్కకు జట్టులో చోటు కల్పించారు. కానీ, అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడ్ని టోర్నీ మొత్తం నుంచి తప్పించినట్లు జట్టు మేనేజ్మెంట్ తెలిపింది.
తాజాగా అతని స్థానంలో షెహన్ జయసూర్యను జట్టులోకి తీసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా బోర్డు ప్రకటించింది. ఇప్పటికే, దేశవాళీ టోర్నీలో వేలికి గాయం అవడంతో దినేశ్ చండీమాల్ ఆసియా కప్ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. ఇలా శ్రీలంక జట్టుకు చెందిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు టోర్నీకి దూరం కావడం ఆ జట్టుకు ఎదురుదెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
సెప్టెంబర్ 15 (శనివారం) నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ ప్రారంభంకానుంది. గ్రూప్-బిలో ఉన్న శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య శనివారం తొలి మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆరు దేశాల జట్లు యూఏఈ చేరుకున్నాయి. సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే ఈ టోర్నీ 28తో ముగియనుంది.
శ్రీలంక జట్టు:
Angelo Mathews (Captain), Kusal Perera, Kusal Mendis, Upul Tharanga, Niroshan Dickwella, Shehan Jayasuriya, Thisara Perera, Dasun Shanaka, Dhanajaya de Silva, Akila Dananjaya, Dilruwan Perera, Amila Aponso, Kasun Rajitha, Suranga Lakmal, Dushmantha Chameera and Lasith Malinga.