హైదరాబాద్: ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ పర్యటన టీమిండియా క్రికెటర్ల రికార్డులను మార్చేసింది. కొందరు ఉన్నత స్థానాలకు చేరితే మరికొందరు అలానే ఉండిపోవాల్సి వచ్చింది. మరి కొద్ది గంటల్లో అంటే సెప్టెంబరు15 నుంచి మొదలుకానున్న ఆసియా కప్ మరెన్ని రికార్డులు పడగొట్టనుందో చూడాలి. ఈ క్రమంలోనే భారత డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా నెం.1 ర్యాంక్కి అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాడు.
యూఏఈ వేదికగా ఈ నెల 15 నుంచి ఆసియా కప్ జరగనుండగా.. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్తో పాటు అఫ్గానిస్థాన్ కూడా పోటీపడనుంది. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన రషీద్ ఖాన్.. అదే జోరుని ఆసియా కప్లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ప్రస్తుతం బుమ్రా 775 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 755 పాయింట్లతో రషీద్ ఖాన్ తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు.
సెప్టెంబరు 18న హాంకాంగ్తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్ జట్టు ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా 19న పాకిస్థాన్తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చినా.. అతని నెం.1 స్థానానికి మాత్రం ఢోకా లేదు. ప్రస్తుతం కోహ్లీ 911 పాయింట్లతో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో ఉన్న బాబర్ అజామ్ (పాకిస్థాన్) ఖాతాలో 825 పాయింట్లే ఉన్నాయి.
ఆసియా కప్ 2018 టోర్నీలో టీమిండియా ఆడనుంది. సెప్టెంబర్ 18 నుంచి హాంగ్కాంగ్తో జరిగే తొలి మ్యాచ్ 16 మంది సభ్యులతో కూడిన జట్టులో భాగమైంది. ఈ టోర్నీకి వేదికలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్, అబు దాబిలు కానున్నాయి. టోర్నమెంట్లో ఉన్న గ్రూపులు రెండు ఏ, బీ. ఇందులో గ్రూపు ఏ కు సంబంధించి ఇండియా, పాకిస్తాన్, హాంగ్కాంగ్ . గ్రూపు బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్లు ఉన్నాయి. కాగా, భారత్ ఈ టోర్నీలో ఆరు సార్లు టైటిల్ గెలుచుకోగా, శ్రీలంక ఐదు సార్లు విజేతగా నిలిచింది. భారత్ విజేతగా నిలిచిన ఆరింటిలో మూడు సార్లు ఫైనల్ పోరులో శ్రీలంకతోనే పోరాడటం గమనార్హం.