హైదరాబాద్: యూఏఈ వేదికగా ఆసియా కప్ ఆరంభానికి సర్వం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్లో క్వాలిఫయిర్తో తలపడనున్నా టీమిండియా, ఆ తర్వాత చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్తో దుబాయి వేదికగా సెప్టెంబర్ 19న తలపడనుంది.
ఆసియా కప్ చరిత్ర, మ్యాచ్ రికార్డులు, గణాంకాలను తెలుసుకోండి
శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, హాంకాంగ్ జట్లు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి టోర్నీలో తలపడనున్నాయి. హాంకాంగ్ ఆడనున్న అన్ని మ్యాచ్లకు కూడా ఐసీసీ అంతర్జాతీయ వన్డే హోదాను కల్పించిన సంగతి తెలిసిందే.
గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్, హాంకాంగ్ ఉండగా... గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 15(శనివారం) టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. టోర్నీలో చివరి మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది. గత ఆసియా కప్ టోర్నమెంట్కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది.
గత ఆసియా కప్ టోర్నీని తొలిసారిగా టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. అయితే, ప్రస్తుతం నిర్వహిస్తోన్న టోర్నీని మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్స్లో నెగ్గిన రెండు జట్లు సెప్టెంబర్ 28న దుబాయి వేదికగా ఫైనల్లో తలపడతాయి.
ఆసియా కప్లో నమోదైన రికార్డులు:
* మొట్టమొదటి ఆసియా కప్ 1984లో జరిగింది. ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక అయింది. ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిన జరిగిన ఈ టోర్నీని కొత్తగా ఏర్పడిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించింది. మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని టీమిండియా పాకిస్థాన్, శ్రీలంకను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.
* ఇప్పటివరకు 13 సార్లు ఆసియా కప్ టోర్నీ జరిగింది. భారత జట్టు ఆరు సార్లు ఆసియా కప్ను ఎక్కువ సార్లు కైవసం చేసుకుంది. భారత్ ఆరు సార్లు టైటిల్ విజేతగా నిలవగా, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు ఈ ట్రోఫీని నెగ్గాయి.
* శ్రీలంక వేదికగా జరిగిన రెండో ఎడిషన్ ఆసియా కప్ నుంచి భారత్ తప్పుకుంది. దీంతో ఈ టోర్నీలో భారత్ స్థానంలో బంగ్లాదేశ్ ఆడింది. ఫైనల్లో పాకిస్థాన్ను చిత్తుగా ఓడించి ట్రోఫీని శ్రీలంక సొంతం చేసుకుంది.
* 1998లో జరిగిన ఆసియా కప్కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. బంగ్లాదేశ్లో తొలిసారి జరిగిన మల్టీ నేషన్ టోర్నమెంట్ ఇది. ఫైనల్లో శ్రీలంకపై ఘన విజయం సాధించిన భారత్ రెండోసారి ట్రోఫీని అందుకుంది.
* ఆసియా కప్లో భారత బౌలర్లు ఒక్కసారి మాత్రమే 5 వికెట్లను పడగొట్టారు. ఢాకా వేదికగా 1998లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్ అర్షద్ ఆయూబ్ ఈ మైలురాయిని సాధించాడు. ఈ మ్యాచ్లో అతడు 21/5తో చెలరేగడంతో భారత్ ఘన విజయం సాధించింది.
* 1990లో భారత్లో జరిగిన ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ తప్పుకుంది. అప్పట్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణం. ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.
* 1993లో భారత్, పాకిస్థాన్ల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆసియా కప్ జరగలేదు.
* 5వ ఎడిషన్ ఆసియా కప్ షార్జా వేదికగా జరిగింది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఫైనల్కు ఇండియా, శ్రీలంక మంచి రన్ రేట్తో ఫైనల్కు అర్హత సాధించాయి. ఫైనల్లో భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
* 1997లో స్వదేశంలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ను ఓడించి శ్రీలంక ట్రోఫీని కైవసం చేసుకుంది.
* 2000లో జరిగిన ఆసియా కప్లో తొలిసారి భారత్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. బంగ్లాదేశ్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంకపై పాకిస్థాన్ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
* 2004 ఆసియా కప్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ టోర్నీలో హాంకాంగ్, యూఏఈ సైతం ఆడాయి. దీంతో మొట్టమొదటిసారి ఈ టోర్నీని మూడు స్టేజిలుగా విభజించారు. గ్రూప్ స్టేజీ, సూపర్ ఫోర్, ఫైనల్. ఫైనల్లో భారత్ను ఓడించి శ్రీలంక ట్రోఫీని కైవసం చేసుకుంది.
* 2008లో పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన ఆసియా కప్లో భారత జట్టు ఫైనల్కు చేరింది. ఫైనల్లో అజంతా మెండిస్ అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ను శ్రీలంక ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో అజంతా మెండిస్ 6/13 బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. ఆసియా కప్ టోర్నీలోనే ఓ బౌలర్ అద్భుత ప్రదర్శన ఇది.
* 2010లో నిర్వహించిన ఆసియా కప్లో 15 ఏళ్ల తర్వాత భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో కేవలం పాకిస్థాన్, ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్లు మాత్రమే పాల్గొన్నాయి.
* ఆసియా కప్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ స్ట్రయిక్ రేట్ని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కలిగి ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సెహ్వాగ్ 2.5 ఓవర్లు వేసి 6 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
* 2012 ఆసియా కప్ను పాకిస్థాన్ రెండోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో బంగ్లాదేశ్పై చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో 2 పరుగుల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది.
* 2012లో జరిగిన ఆసియా కప్లో పాకిస్థాన్పై విరాట్ కోహ్లీ చేసిన 183 పరుగులే టోర్నీలో ఓ ఆటగాడు సాధించిన అత్యధిక పరుగులు.
* 2014లో జరిగిన ఆసియా కప్లో తొలిసారి ఆప్ఘనిస్థాన్ పాల్గొంది. ఢాకా వేదికగా ఈ టోర్నీ జరిగింది. ఫైనల్లో పాకిస్థాన్పై శ్రీలంక అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
* 2015లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆసియా కప్ను వన్డే, టీ20 ఫార్మాట్లలో నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.
* మొట్టమొదటిసారి 2016లో జరిగిన ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. ఢాకా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత జట్టు అలవోక విజయాన్ని నమోదు చేసింది.
* ఆసియా కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య 1220 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఒక ఆసియా కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా సనత్ జయసూర్య అరుదైన ఘనత సాధించాడు (2008లో జరిగిన ఎడిషన్లో జయసూర్య 378 పరుగులు చేశాడు).
* ఆసియా కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సనత్ జయసూర్య నిలిచాడు. ఆసియా కప్లో సనత్ జయసూర్య చేసిన సెంచరీలు సంఖ్య 6.
* ఆసియా కప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీ ధరన్ (24 మ్యాచ్ల్లో 30 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
* ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో ఏ భారత బ్యాట్స్మెన్ కూడా డకౌట్ కాలేదు. అయితే, ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహించినప్పుడు మాత్రం ఈ రికార్డు బద్దలైంది.