

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం భారత్-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ దృశ్యం కోట్ల మంది క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకుంది. టీమిండియా ఆటగాళ్ల క్రీడా స్ఫూర్తిని ఈ సందర్భంగా చాటి చెప్పింది. అసలేం జరిగిందంటే...
మంగళవారం టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఆప్ఘన్ బ్యాట్స్మెన్ మహ్మద్ షెహజాద్ ఆడుతున్న సమయంలో అతని షూ లేస్ ఊడిపోయింది. ఇబ్బంది పడుతున్న అతనిని సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ గమనించాడు. వెంటనే షహజద్ దగ్గరకు వెళ్లి అతని షూ లేస్ కట్టాడు.
ఈ దృశ్యం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. అంతేకాదు భారత క్రీడాకారుల క్రీడా స్ఫూర్తికి అద్దం పట్టింది. దినేష్ కార్తీక్ చర్యను సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే, దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్లో భారత జట్టు విజయం సాధిస్తుందని అనుకుంటే, మ్యాచ్ అనూహ్యంగా టైగా ముగిసింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. అనంతరం 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.
లక్ష్య చేధనలో భారత జట్టు ఆటగాళ్లు కేఎల్ రాహుల్, అంబటి రాయుడు మెరుపు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన అంబటి రాయుడు సిక్స్లతో చెలరేగాడు. రాహుల్ 55 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, రాయుడు 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించాడు.
దూకుడుగా ఆడే క్రమంలో రాయుడు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాహుల్ సైతం పెవిలియన్కు చేరాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత భారత స్కోరు నెమ్మదించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని (8), పాండే (8), జాదవ్ (19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.
ఆ తర్వాత కార్తీక్ (44) ఔట్ కావడంలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయానికి ఆఖరి ఓవర్లో 7 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఒకే ఒక వికెట్ ఉంది. ఆప్ఘన్ కెప్టెన్ అస్గర్ బౌలర్ రషీద్ఖాన్కు బంతి ఇచ్చాడు. ఈ సమయంలో క్రీజులో ఉన్న ఆల్రౌండర్ జడేజా రెండో బంతికి ఫోర్ కొట్టి ఆశలు రేపాడు. ఆ తర్వాత మరో రెండు సింగిల్స్ రావడంతో స్కోర్ సమమైంది.