ఆరంభంలోనే ఎదురు దెబ్బ
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (2) రిటైర్డ్హర్ట్గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ లిట్టన్ దాస్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన షకిబుల్ హసన్ కూడా డకౌటయ్యాడు. అయినప్పటికీ బంగ్లా పోటీ ఇవ్వగల స్కోరు చేసిందంటే మాత్రం దానికి కారణం ముష్ఫికర్ రహీమ్.
సెంచరీతో జట్టును ఆదుకున్న ముష్ఫికర్ రహీమ్
ఆరంభంలోనే ముగ్గురు బ్యాట్స్మెన్స్ను కోల్పోయిన బంగ్లాను ముష్ఫికర్ రహీమ్ (144; 150 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు) ఒంటరి పోరు చేసి సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మహ్మద్ మిథున్(63) కలిసి అమూల్యమైన మూడో వికెట్కు 134 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అయితే ఇతర బ్యాట్స్మెన్ విఫలం కావడంతో 261 పరుగులకే పరిమితమైంది.
262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక
బంగ్లా బౌలర్లలో మొర్తాజా 2, రహ్మాన్ 2, హసన్ 2, షకిబ్, రుబెల్, హుస్సైన్ తలో వికెట్ తీశారు. అనంతరం 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు బెంబేలెత్తించారు. వరుస విరామాల్లో వికెట్లను తీస్తూ మ్యాచ్పై ఆదిపత్యం చెలాయించారు. 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వంద పరుగుల్లోపే 8 వికెట్లను కోల్పోయిన లంక పరాజయాన్ని ఖాయం చేసుకుంది.
35.1 ఓవర్లలో 124 పరుగులకే శ్రీలంక ఆలౌట్
దిల్రువాన్ పెరెరా(29), తరంగ (27) మినహా మరెవరూ రాణించకపోవడంతో 35.1 ఓవర్లలో 124 పరుగులకే శ్రీలంక జట్టు ఆలౌటైంది. లంక బ్యాట్స్మెన్లలో ఉపుల్ తరంగ (27), పెరీరా(29), లక్మల్(20), మథ్యూస్(16), కుశాల్ పెరీరా(11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. శ్రీలంక బౌలర్లలో లసిత్ మలింగ 4 వికెట్లతో రాణించాడు.