

న్యూ ఢిల్లీ: డీఆర్ఎస్ అడగడంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ దిట్ట. ఎంతంటే ఎంఎస్ ధోనీకి బదులు డీఆర్ఎస్ ధోనీ అనేంత కచ్చితత్వంతో కూడి ఉంటాయి అతను సమీక్ష అడిగిన సందర్భాలు. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత డీఆర్ఎస్పై అంతర్జాతీయ కెప్టెన్లకి శిక్షణ తరగతులు బోధిస్తూ సెటిల్ అవ్వాలని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సూచించాడు.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్, అఫ్గానిస్థాన్ కెప్టెన్లు రివ్యూ (డీఆర్ఎస్) అడగడంలో తడబడి వాటిని వృథా చేసుకోగా.. భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఒక్క రివ్యూ మినహా.. చాలా వరకూ సమర్థంగా వినియోగించుకున్నాడు. దీనికి కారణం మహేంద్రసింగ్ ధోనీ సలహా సూచనలు అతను తీసుకోవడమే అని చాలా సందర్భాల్లో స్పష్టమైంది.
వికెట్ల వెనుక డేగ చూపుతో ఉండే ధోనీ.. వేగంగా బౌలర్ చేతిలో నుంచి వచ్చే బంతిని అంచనా వేయడంలో దిట్ట. ఇలా.. కెప్టెన్ కోహ్లీ అయినా.. తాజాగా ఆసియా కప్లో భారత జట్టుకి కెప్టెన్సీ వహిస్తున్న రోహిత్ అయినా.. ధోనీ సూచన లేనిదే రివ్యూ అడిగే సాహసం దాదాపు చేయట్లేదు. వారి అంచనాలకి తగినట్లే.. ధోనీ చాలా వరకూ విజయవంతమయ్యాడు.
క్రికెట్లోకి డీఆర్ఎస్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ధోనీ తరహాలో ఎక్కువ రివ్యూలను కరెక్ట్గా అంచనా వేసిన మరో క్రికెటర్ లేడంటే అతిశయోక్తి కాదేమో..? అందుకే ఆకాశ్ చోప్రా.. డీఆర్ఎస్ అడగడంపై కెప్టెన్లకి ధోనీ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ సెటిల్ అవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది.