మన్కడింగ్ రనౌట్ విషయంలో
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్వార్న్, ఇంగ్లాండ్ క్రికెటర్లు బెన్స్టోక్స్, జేసన్ రాయ్, ఇయాన్ మోర్గాన్ తదితరులు మన్కడింగ్ రనౌట్ విషయంలో అశ్విన్ అనైతికంగా వ్వవహారించాడని తీవ్ర విమర్శలు గుప్పించగా.. భారత మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, కామెంటేటర్ హర్షాభోగ్లే మాత్రం అశ్విన్కి మద్దతు పలికారు.
అశ్విన్ది ఏమాత్రం తప్పులేదని
ఈ విషయంలో అశ్విన్ది ఏమాత్రం తప్పులేదని, అతడు నిబంధనల మేరకే నడుచుకున్నాడని క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) స్పష్టం చేసింది. మన్కడింగ్ నిబంధన ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని మంగళవారం ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) ఓ ప్రకటనలో పేర్కొంది.
ఎంసీసీ ఇలా
"ఈ నిబంధన ఎంతో ముఖ్యం. ఇది లేకుంటే నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో బ్యాట్స్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాడు. బౌలర్ బంతి వేయకుండానే సగం పిచ్ దాటేస్తారు. ఇలా జరగకుండాలంటే ఈ నిబంధన ఉండాల్సిందే. ఇక బౌలర్ బ్యాట్స్మన్ను హెచ్చరించాలనే విషయం నిబంధనలో లేదు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్దం కూడా కాదు. బౌలర్ బంతి వేయకుండానే నాన్స్ట్రైకర్ క్రీజు దాటితేనే రనౌట్ అవుతారు" అని స్పష్టం చేసింది.
రాహుల్ ద్రవిడ్ ఇలా
ఈ మన్కడింగ్ రనౌట్పై తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ద్రవిడ్ మాట్లాడుతూ "అశ్విన్ చేసిన మన్కడింగ్ రనౌట్పై కొంతమంది అతిగా స్పందించారు. కొందరైతే.. అతని క్యారెక్టర్ని కూడా శంకించారు. ఎందుకంటే అతను తప్పుచేశాడని వారి భావన. మరోవైపు అశ్విన్ తాను చేసింది కరెక్ట్ అని వాదిస్తున్నాడు" అని అన్నాడు.
బట్లర్ని ‘మన్కడింగ్’పై హెచ్చరించి ఉండాల్సింది
"నిజానికి ఆ వాదనని కొంతమంది అంగీకరించరు. ఏదిఏమైనా.. మ్యాచ్లో ఒక బౌలర్గా అతనికి ఉన్న హక్కుల్ని వినియోగించుకున్నాడు. అంతమాత్రాన అతడ్ని చెడ్డవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయద్దు. నా వరకూ నేను చెప్పేది ఏంటంటే? అశ్విన్ ఒకసారి బట్లర్ని ‘మన్కడింగ్'పై హెచ్చరించి ఉండాల్సింది. అతను క్రికెట్ నిబంధనలకి అనుగుణంగా వెళ్లి రనౌట్ చేశాడు కాబట్టి ఎవరినీ మోసం చేసినట్లు కాదు" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.