హైదరాబాద్: సంచలన ఫలితాలతో ప్రపంచ క్రికెట్ మరింత పటిష్టమవుతుందని టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకపై జింబాబ్వే వన్డే సిరీస్ గెలవడం క్రికెట్కు ఎంతో మేలు చేస్తుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. సొంతగడ్డపై జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరిస్ను జింబాబ్వే 3-2తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
సోమవారం అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ జింబాబ్వే శ్రీలంకను ఓడించి వన్డే సిరీస్ గెలవడం ఒక రకంగా ఆటకే మంచిదని చెప్పుకొచ్చాడు. 'దీంతో ఎవరిని ఎవరైనా ఓడించొచ్చనే విషయం అర్థమైంది. ఇంకోరోజు అఫ్గానిస్థాన్ మరో పెద్ద జట్టును ఓడించొచ్చేమో. ఇలాంటి ఫలితాలే క్రికెట్కు కావాలి. అలా అయితేనే క్రికెట్ భవిష్యత్ మరింత బావుంటుంది' అని అశ్విన్ అన్నాడు.

త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టులో అశ్విన్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. జులై 21 నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల ప్రాక్టీస్ గేమ్తో శ్రీలంక పర్యటన ప్రారంభమవుతుంది.
అనంతరం జులై 26 నుంచి గాలేలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే 'భారత జట్టు కొత్త కోచ్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయను. ఇలా వ్యాఖ్యానించడం కూడా సరికాదు. పరిస్థితులు ఎలా ఉన్నా భారత జట్టు ముందుకు సాగుతూనే ఉంటుంది' అశ్విన్ చెప్పాడు.