మెల్బోర్న్: తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ అశ్విన్ అచ్చం తనలాగే ఆడుతున్నాడని భారత్ మాజీ క్రికెట్ అనిల్ కుంబ్లే అన్నారు. ఆదివారం మెల్బోర్న్లో దక్షిణాఫ్రికా-ఇండియా మధ్య జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు.
అశ్విన్ బౌలింగ్ విధానం, క్రీడాస్ఫూర్తి, ప్రశాంతంగా ఉండే తత్వం అంతా తనలాగే పోలి ఉన్నాయని చెప్పారు. తాను టీమిండియాకు ఆడే సమయంలో అలాగే ఉండేవాడినని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకంటే అతను మంచి ఆటగాడని అన్నారు.
విదేశాల్లో ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశాలు వచ్చినప్పుడే అతను మరింతగా తన బౌలింగ్ను మెరుగు పరచుకోగలడని పేర్కొన్నాడు. విదేశాల్లో టెస్టు మ్యాచ్లు ఆడుతున్నప్పుడు టీమిండియా ఒక స్పిన్నర్తోనే బరిలోకి దిగుతుందన్నారు.

దక్షిణాఫ్రికా-భారత్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా: అగార్కర్
ఆదివారం జరిగే దక్షిణాఫ్రికా-భారత్ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అన్నారు. ఫిబ్రవరి 15న జరిగిన భారత్-పాక్ మ్యాచ్లో భారత్ క్రికెటర్లు అధ్బుతమైన ప్రదర్శనను కనబర్చారని కొనియాడారు.
ఆదివారం తలపడనున్న రెండు జట్లు కూడా పటిష్టంగా ఉండటంతో ఆ మ్యాచ్ను వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో జట్టు సమానంగా రాణించినప్పుడే గెలుపు సునాయాసం అవుతుందన్నారు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్తో పటిష్టంగా ఉంటే, దక్షిణాఫ్రికా బౌలింగ్ లైనప్తో పాటు, బ్యాటింగ్ లైనప్తో పటిష్టంగా ఉందన్నారు.