ఢాకా: గడచిన నాలుగేళ్లుగా కెప్టెన్ ధోని ఇద్దరు స్పిన్నర్లపై ఆధారపడ్డాడు. ఒకరు ఆఫ్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కాగా, మరొకరు లెఫ్టార్మ్ స్ఫిన్నర్ రవీంద్ర జడేజా. బంగ్లాదేశ్తో రేపటి నుంచి వన్డే సిరిస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మిర్పుర్లో ధోని విలేకరులతో మాట్లాడాడు.
ముందుగా అశ్విన్ గురించి ధోని మాట్లాడుతూ అతనెంతో (అశ్విన్) మెరుగయ్యాడని అన్నాడు. విభిన్న పరిస్ధితుల నేపథ్యంలో తన ఆటకు మెరుగులు దిద్దుకోవడం ఓ టెస్టు క్రికెటర్కు ఎంతో అవసరమని చెప్పాడు.

అశ్విన్ ఆట గురించి బాగా ఆలోచిస్తాడని, అందుకే బౌలింగ్ను చాలా చక్కగా మెరుగుపర్చుకోగలిగాడని తెలిపాడు. క్లిష్ట సమయాల్లో బ్యాటింగ్ కూడా అద్భతంగా చేస్తాడని కొనియాడాడు. ఇక రవీంద్ర జడేజా గురించి మాట్లాడుతూ భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని పేర్కొన్నాడు.
'ఐపీఎల్లో చక్కగా రాణించాడు. వరల్డ్ కప్లోనూ మెరుగైన ఆటతీరు కనబర్చాడనే భావిస్తున్నా. బౌలింగ్ చేసే చేతికి గాయమైన తర్వాత కోలుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడం మామూలు విషయం కాదు' అని ధోని చెప్పాడు.