హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ను ఎదుర్కొవడానికి ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెగ ఇబ్బందులు పడుతున్నాడు.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 33 పరుగుల వద్ద వార్నర్ను అశ్విన్, రెండో ఇన్నింగ్స్లో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్ లోనే నిష్క్రమించడం విశేషం. రెండో ఇన్నింగ్స్ 10 ఓవర్లో అశ్విన్ బౌలింగ్లో వార్నర్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
తాజా అవుట్తో 13 టెస్టుల్లో తొమ్మిదిసార్లు అశ్విన్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు. దాంతో తన టెస్టు కెరీర్లో ఒకే ఆటగాడ్ని అత్యధిక సార్లు అవుట్ చేసిన ఘనతను అశ్విన్ సాధించాడు. కాగా, అదే సమయంలో ఒకే బౌలర్కు తన వికెట్ను అత్యధిక సార్లు సమర్పించుకున్న అప్రతిష్టను వార్నర్ సొంతం చేసుకొన్నాడు.
ఇదిలా ఉంటే బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో పూణె టెస్టు ఓటమికి కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకుంది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ 1-1తో సమమైంది. బెంగుళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు.
తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా ఆరు వికెట్లు తీసుకోగా రెండో ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు తీసుకోగా ఉమేశ్ యాదవ్ 2, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక మూడో టెస్టు మార్చి 16వ తేదీన రాంచీలో జరగనుంది.
బెంగుళూరు టెస్టు:
తొలి ఇన్నింగ్స్:
భారత్: 189, ఆస్ట్రేలియా 274
రెండో ఇన్నింగ్స్:
భారత్: 276, ఆస్ట్రేలియా 112 (35.4 ఓవర్లకు)
మ్యాచ్ ఫలితం: 75 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
High fives all around. India win the 2nd @Paytm Test by 75 runs. Level the 4-match Test series 1-1 #INDvAUS pic.twitter.com/XDEmS7L8fN
— BCCI (@BCCI) 7 March 2017