మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. భారత్కు రెండు దశాబ్దాలుగా విజయాలు అందించిన సారథులు. ధోనీ సారథ్యంలో టీమిండియా రెండు ప్రపంచకప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇటీవల రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 వరల్డ్ కప్ నెగ్గింది. ఇక కోహ్లి ఐసీసీ ట్రోఫీలు సాధించనప్పటికీ విదేశాల్లో దేశానికి అత్యుత్తమ విజయాలు అందించిన సారథిగా నిలిచాడు.
అయితే ఈ ముగ్గరిలో వ్యూహాత్మకంగా రోహిత్ శర్మనే తెలివైనోడు అని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''రోహిత్ కెప్టెన్సీలో ఓ రెండు మూడు విషయాలు ఎంతో బాగుంటాయి. అతను జట్టు వాతావరణాన్ని ఎంతో తేలికగా ఉంచుతాడు.రోహిత్ ఎంతో సమతుల్యంగా ఉంటాడు. వ్యూహాత్మకంగా అతను బలవంతుడు. వ్యూహాత్మకంగా ధోనీ, కోహ్లి కూడా బలవంతులే. కానీ రోహిత్ వ్యూహాలపై మరింత పనిచేస్తాడు''

''ఏదైనా పెద్ద మ్యాచ్ లేదా సిరీస్ ఉంటే.. రోహిత్ ఎనలిటిక్స్ టీమ్, కోచ్లతో కలిసి ప్రిపరేషన్ మొదలుపెడతాడు. ఓ బ్యాటర్కు ఏదీ బలహీనత, ఓ బౌలర్కు ఏ ప్లాన్ వర్కౌట్ చేయాలని ఆలోచిస్తారు. అదే అతని బలం. అయితే అతను జట్టులో తేలికైన వాతావరణాన్ని తీసుకువస్తాడు. ప్లేయర్లకు అండగా నిలుస్తాడు. ఓ ఆటగాడు తుదిజట్టులో ఎంపికైతే, అతనికి 100 శాతం మద్దతు ఇస్తాడు. నా కెరీర్ మొత్తం దాదాపు ఈ ముగ్గురు కెప్టెన్సీలోనే ఆడాను'' అని అశ్విన్ పేర్కొన్నాడు.
ఎంఎస్ ధోనీ 2007 నుంచి 2018 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అన్ని ఫార్మాట్లో కలిపి ధోనీ 332 మ్యాచ్లకు కెప్టెన్సీ వహించగా 178 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. ఇక 2013 నుంచి 2022 వరకు కోహ్లి సారథ్యంలో భారత్ 213 మ్యాచ్ల్లో 135 గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు 126 మ్యాచ్ల్లో 93 మ్యాచ్లు గెలిచింది.