బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా టీం ససేమిరా అంది. దాని కన్నా కూడా బెంగళూరులో నాలుగు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆసీస్ జట్టు అసలు ఈ నిర్ణయం ఎలా తీసుకుందని ఆ జట్టును కొందరు ప్రశ్నించారు. దీనికి ఆ జట్టు కీలక బ్యాటర్ స్టీవ్ స్మిత్ షాకింగ్ సమాధానం ఇచ్చాడు.
భారత క్రికెట్ బోర్డుపై తమకు నమ్మకం లేదని, అందుకే తాము ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదని స్మిత్ చెప్పాడు. గతంలో తాము భారత్లో ఆడేందుకు వచ్చినప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన విషయాన్ని గుర్తుచేశాడు. 'అప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్కు పచ్చని పిచ్ తయారు చేశారు. కానీ సిరీస్లో తొలి టెస్టులో పూర్తి స్పిన్ పిచ్ రెడీ చేశారు. దీని వల్ల మేం మ్యాచ్కు సరిగా ప్రిపేర్ కాలేకపోయాం. అందుకే ఇప్పుడు విడిగా ప్రాక్టీస్ సెషన్స్ పెట్టుకున్నాం. సిరీస్ ఆరంభమైన తర్వాత మా నిర్ణయం మంచిదని అర్థం అవుతుంది' అని స్మిత్ చెప్పాడు.
ఈ వ్యాఖ్యలపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్వన్ స్పందించాడు. ఇలా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకపోవడం కొత్త విషయం ఏం కాదన్నాడు. 'భారత్ కూడా పలు సందర్భాల్లో విదేశీ పర్యటనల్లో ప్రాక్టీస్ మ్యాచులు ఆడదు. అసలే టైట్ షెడ్యూల్ ఉండగా.. ప్రాక్టీస్ మ్యాచులకు అదే ఇంటెంట్తో ఆడటం కుదరదు. అందుకే వీటిని ఎవాయిడ్ చేస్తాం. కానీ ఇలా మాట్లాడటం ఆస్ట్రేలియా జట్టు ప్లాన్ అని చెప్పాలి. ఆ జట్టుకు ఇదంతా అలవాటే. వాళ్ల స్ట్రాటజీలు అలాగే ఉంటాయి. ఇలా మైండ్ గేమ్స్ ఆడటం ఆస్ట్రేలియా టీం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది' అని తేల్చేశాడు.