మెల్బోర్న్: బ్యాట్స్మెన్ను ఎదుర్కుని వికెట్లు ఎలా తీయాలో తనకు తెలుసునని, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ తనను ఇబ్బంది పెట్టలేరని భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురువారంనాడు అన్నాడు. శుక్రవారం రెండో ట్వంటీ20 మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కు అతను హెచ్చరిక పంపించాడు.
ఇది బ్యాట్స్మెన్ టోర్నమెంట్ అని, బ్యాట్స్మెన్ వారి పద్ధతిలో వారు ఆడుతున్నప్పుడు తగిన ప్రదేశంలో బంతి విసరాల్సి ఉంటుందని, తన విషయానికి వస్తే తాను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నానని, తన ప్లాన్స్ తనకు ఉన్నాయని, సర్కిల్ వెలుపల తనకు అదనపు ఫీల్డర్ అవకాశం కూడా ఉందని, అది చాలు అని ఆయన అన్నారు.

తొలి ట్వంటీ20 మ్యాచులో ఆరోన్ ఫించ్ తన బంతులను చితకబాదడానికి ప్రయత్నించిన విషయంపై కూడా అతను స్పందించాడు. వారికి లైసెన్స్ ఉన్న ప్పుడు తనకూ ఉంటుందని, వికెట్లు తీసుకోవడానికి తనకు లైసెన్స్ ఉందని, ఇతర ఆఫ్ స్పిన్నర్ల మాదిరిగా ఫించ్ తనను అనుకోవద్దని అన్నాడు.
అది ఆఫ్ స్నిన్నర్కు సంబంధించిన విషయం కాదని, ప్రతి ఒక్కరూ పరుగుల కోసం చూస్తారని, బౌలర్పై దాడి చేస్తున్నావా లేదా అనేది గేమ్ ప్లాన్ అని, అది వారి గేమ్ ప్లాన్ అయితే కొనసాగిస్తే చాలా సంతోషిస్తానని, వారిపై తాను అధిపత్యం సాధించగల సామర్థ్యాన్ని సంతరించుకున్నానని అశ్విన్ అన్నాడు.
తొలి ట్వంటీ20 మ్యాచులో తాను తొలి ఓవరు తాను చాలా బాగా వేశానని, తన బౌలింగులో తప్పు ఏమీ లేదని, వారు పరుగులు చేశారని అన్నాడు. వికెట్లు తీస్తున్నావా, లేదా అనేదే ప్రధానమవుతుందని అన్నాడు.