Ashutosh Sharma: ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. ఈ రసవత్తర పోరులో ఢిల్లీ విజయం సాధించింది. ఈ గెలుపుకు కారణమైన యువ ఆటగాడు అశుతోష్ శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ' అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అశుతోష్ తన గురువు, భారత మాజీ కెప్టెన్ శిఖర్ ధావన్ కు అంకితం చేశాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో అశుతోష్ కు ఓ స్పెషల్ వీడియో కాల్ వచ్చింది. అది తన మెంటార్ శిఖర్ ధావన్ నుంచి వీడియో కాల్ రాగా.. ఆ యువ ఆటగాడిని గబ్బర్ ప్రత్యేకంగా అభినందించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్ లో సంబరాలకు ముందు అశుతోష్ శర్మ శిఖర్ ధావన్తో వీడియో కాల్లో మాట్లాడాడు. 'చాలా ఆనందంగా ఉంది.. లవ్ యూ పాజీ' అని అశుతోష్ శర్మ తన ప్రేమను వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. 'అశ గబ్బర్.. ఇది ఢిల్లీ లవ్ స్టోరీ' అంటూ క్యాప్షన్ ను రాసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తన మెంటర్ ధావన్ కు అంకితమిస్తున్నానని అశుతోష్ శర్మ మీడియాతో పేర్కొన్నాడు. వీరిద్దరూ గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. గతేడాది పంజాబ్ తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ... ఈ సారి వేలంలో 3.8 కోట్లకు ఢిల్లీ సొంతమయ్యాడు. తొలి మ్యాచ్ లోనే ఈ యువ ఆటగాడు జట్టు ప్రమాదంలో ఉన్న సమయంలో క్రీజులో కుదురుకుని భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నికోలస్ పూరన్(75), మిచెల్ మార్ష్(72) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లతో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో అశుతోష్ శర్మ(66*), విప్రజ్ నిగమ్(39) దంచికొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.