చిన్నసామి స్టేడియంలో మీడియాతో బుమ్రా
ఈ సందర్భంగా బుమ్రా బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో మీడియాతో మాట్లాడాడు. 'నెహ్రా ఎప్పుడూ తోడుగా ఉండేవాడు. 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో ఇద్దరం కలిసే ఆడాం. అతడు (నెహ్రా) సూచనలు నాకెంతో ఉపయోగపడ్డాయి. అంతర్జాతీయ క్రికెట్లో అతడు ఎన్నో మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించాడు. కఠిన పరిస్థితుల్లో 'నువ్వు చేయలగలవు', నువ్వు చేయాలంటూ ఆత్మవిశ్వాసం నింపేవాడు' అని బుమ్రా చెప్పాడు.
రెండో టీ20లో అంపైరింగ్ నిర్ణయంపై బుమ్రా
ఇక రెండో టీ20లో అంపైరింగ్ నిర్ణయంపై ఇంగ్లాండ్ చేసిన విమర్శల గురించి తాము ఇప్పుడు పట్టించుకోనవసరం లేదని చెప్పాడు. కొన్నిసార్లు నిర్ణయాలు మనకు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా రావడం ఆటలో సహజమేనని చెప్పుకొచ్చాడు. తమ దృష్టంతా మూడో వన్డేపైనే ఉందని అన్నాడు. మూడో టీ20లో టీమిండియా సమష్టిగా రాణించి గెలుస్తుందనే నమ్మకాన్ని బుమ్రా వ్యక్తం చేశాడు.
రెండో టీ20లో టీమిండియా విజయంలో కీలకపాత్ర
మూడు టీ20ల సిరిస్లో భాగంగా నాగ్ పూర్లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత విజయంలో బుమ్రా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండో వన్డే చివరి ఓవర్లో విజయానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిన ఇంగ్లాండ్ను కట్టడి చేసే బాధ్యతను జస్ప్రీత్ బుమ్రాకు భారత కెప్టెన్ కోహ్లీ అప్పచెప్పాడు.
రెండో టీ20లో మ్యాజిక్ చేసిన బుమ్రా
చివరి ఓవర్లో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగులు చేయాల్సి ఉండగా బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిలోనే జో రూట్ను అవుట్ చేశాడు. రెండో బంతికి మోయిన్ అలీ సింగిల్ తీయగా, మూడో బంతిలో ఒక్క పరుగు కూడా రాలేదు. నాలుగో బంతిలో జొస్ బట్లర్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతిలో ఒక పరుగు లెగ్బై రూపంలో ఇంగ్లాండ్కు లభించింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
దీనితో చివరి బంతిలో ఇంగ్లాండ్ గెలవడానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. కానీ, ఆ బంతికి మోయిన్ అలీ బీట్ కావడంతో ఒక్క పరుగు కూడా లభించలేదు. భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. చివరి ఓవర్ను అద్భుతంగా బౌల్ చేసిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.