
చిరిగిన 'షూ'తోనే తొలి టెస్టు:
తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా నిర్వహించిన చాట్ షోలో ఆశిష్ నెహ్రా పాల్గొని పలు విషయాలు పంచుకున్నాడు. '1999లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాను. ఆ సమయంలో నా వద్ద ఒక జత షూ మాత్రమే ఉండేవి. రంజీ ట్రోఫీలో ఆడిన వాటితోనే తొలి టెస్టుకు సిద్ధమయ్యా. అయితే మైదానంలో బౌలింగ్, ఫీల్డింగ్ చేయడంతో అవి త్వరగా పాడైపోయేవి. ఇన్నింగ్స్ మధ్య విరామం లభించినప్పుడు చిరిగిన భాగాలను కుట్టుకుని ఆడేవాడిని. అలా మొదటి టెస్ట్ మ్యాచ్ పూర్తిచేశా. ఆ సంఘటన ఇప్పటికీ గుర్తుంది' అని నెహ్రా అన్నాడు.

రైల్వే స్టేషన్ వద్ద ప్రాక్టీస్:
ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో క్లబ్ బౌలింగ్ కోచ్ వద్ద సాధన చేసేవాడిని అని ఆశిష్ నెహ్రా చెప్పాడు. 'నేను ఒంటరిగా ఎప్పుడూ లేను. రైల్వే స్టేషన్ వద్ద ప్రాక్టీస్ చేయడానికి చాలామంది వచ్చేవారు. బౌలింగ్లో వైవిద్యం చూపించమని కోచ్ మమ్మల్ని అడిగేవాడు. మేము స్టేషన్ వద్ద ఉన్న రాళ్లతో కూడా బౌలింగ్ చేసాం. మేము గాలికి వ్యతిరేక దిశలో బౌలింగ్ చేశాం' అని నెహ్రా చెప్పుకొచ్చాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నెహ్రా భారత్ తరఫున 17 టెస్టులు, 120 వన్డేలు, 27 టీ20లు ఆడాడు.

వికెట్ కీపింగ్కి అతనే నా నెం.1 ఛాయిస్:
ఐపీఎల్ 2020 జరగని నేపథ్యంలో ఎంఎస్ ధోనీ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశాలు లేవని నెహ్రా అభిప్రాయపడ్డాడు. 'ధోనీ ఫిట్గా ఉండి.. ఆడే అవకాశం ఉంటే.. వికెట్ కీపింగ్కి అతనే నా నెం.1 ఛాయిస్. అయితే నాకు తెలిసి ధోనీ ఇక క్రికెట్ ఆడకపోవచ్చు. అతను ఎప్పుడు ఎలాంటి షాక్ ఇస్తాడో మనం ఊహించలేం. అతను ఇప్పటివరకూ రిటైర్మెంట్ ప్రకటించలేదన్న విషయం నిజమే. కానీ.. అతను పరిస్థితుల్ని ఏ క్షణంలో ఎలా మారుస్తాడో మనకు తెలియదు. మహీ రిటైర్మెంట్ఇస్తాడని చెప్పడం బాధాకరం.. ఎందుకంటే అతడు టీమిండియాకు ఎంతో చేసాడు. 5వ స్థానంలో రిషబ్ పంత్ లేదా సంజు సామ్సన్ కాకుండా లోకేష్ రాహుల్ ఆడుతున్నాడు. ధోనీకి ప్రత్యామ్నాయం మాత్రం పంత్ అని నా అభిప్రాయం' అని నెహ్రా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












